తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద అప్రకటిత ఆస్తులు ఉన్నాయా? అంటే… అవుననే అంటున్నాయి ఆదాయపన్ను శాఖ వర్గాలు. విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ఐటీ శాఖ నేటి ఉదయం 25 బృందాలతో కోమటిరెడ్డి కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది.
రాజకీయ నేతలుగా ఉన్న ‘కోమటిరెడ్డి బ్రదర్స్’ అంతకు ముందే వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డితో కలిసి వ్యాపారాలు చేస్తున్న కోమటిరెడ్డి… ఇన్ ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్ తదితర రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తూ ఆస్తులు కూడబెట్టుకుంటూ, వాటికి సంబంధించి పన్నులను ప్రభుత్వానికి చెల్లించకుండా ఉండేందుకే వాటిని దాచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని నిర్ధారించుకున్న తర్వాత, గురువారం ఉదయం సమయంలో ఆదాయపు పన్ను శాఖ కోమటిరెడ్డి కార్యాలయాలపై పంజా విసిరింది. ఈ దాడుల్లో కోమటిరెడ్డికి సంబంధించి ఎంతమేర అప్రకటిత ఆస్తులు బయటపడతాయోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే, ఎవరి ద్వారా సమాచారాన్ని సేకరించారో అన్న కలకలం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.



