నేడు తాడేపల్లి ప్యాలస్లో వైసీపీ యువజన విభాగ సమావేశం జరిగింది. జగన్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ స్థాపించినప్పుడు తాను, తల్లి విజయమ్మ మాత్రమే ఉన్నామని, కానీ ఇప్పుడు తన వెంట లక్షల మంది ఉన్నారన్నారు.
ఈ సుదీర్గ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగడం వల్లనే ఇది సాధ్యపడిందన్నారు. పార్టీలో యువత పాత్ర చాలా కీలకమని, వారెప్పుడు ప్రజలకు అందుబాటులో ఉందాలన్నారు. పార్టీలో యువత సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకొని ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో నిరంతరం పోరాడుతూనే ఉండాలన్నారు.
పరామర్శ యాత్రలకు తప్ప తాడేపల్లి ప్యాలస్ బయటకు రాని జగన్, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీలో యువతకి చెపుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, వాటి పరిష్కారం కోసం ఒత్తిడి చేయడం చాలా అవసరమే. పార్టీలు, రాజకీయాలకు దూరంగా ఉండే లక్షలమంది సోషల్ మీడియా ద్వారా ఆ పనిచేస్తున్నారు కూడా.
కానీ జగన్ ప్రోద్బలం, అండ చూసుకొని సోషల్ మీడియాలో రెచ్చిపోయినందుకే పోసాని, సజ్జల వంటివారి మెడకు కేసులు చుట్టుకుని బాధపడుతుంటే, జగన్ పార్టీలో యువకులను సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకొని ప్రభుత్వంతో పోరాడమని ఎగదోస్తూ వారి జీవితాలు కూడా నాశనం చేస్తున్నారని చెప్పక తప్పదు.
జగన్ శాసనసభ సమావేశాలకు హాజరయ్యి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయవచ్చు. అందుకే పులివెందుల ప్రజలు ఆయనని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కూడా. కానీ జగన్ శాసనసభ సమావేశాలకు వెళ్ళకుండా తాడేపల్లి ప్యాలస్లో కూర్చొని సోషల్ మీడియా ద్వారా యుద్ధం చేయాలని చెపుతున్నారు.
ఆనాడు నారా లోకేష్ ఈవిదంగా సోషల్ మీడియాకి పరిమితమైనప్పుడు జగన్తో సహ వైసీపీ నేతలు తప్పు పట్టారు. అవహేళన చేశారు కదా? మరిప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు. ఎందుకు?
అయినా 2019 ఎన్నికలలో అంత భారీ మెజార్టీతో గెలిచిన వైసీపీకి 2024 ఎన్నికలలో కేవలం 11 సీట్లే ఎందుకు వచ్చాయి? అని జగన్ ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకుంటే, తన అహంకారం, అవినీతి, అసమర్దత వల్లనే అని గ్రహిస్తారు.
కానీ అది అంగీకరించ లేకపోతున్నారు కనుక సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కూటమి నేతలు పదేపదే చెపుతున్నారు కదా?
తనని సంస్కరించుకోలేని జగన్ యువతని సంస్కరించగలరా? వారికి ఉజ్వల భవిష్యత్ కల్పించగలరా?అంటే కాదని రోడ్డున పడ్డ లక్షల మంది వాలంటీర్లని చూస్తే అర్దమవుతుంది కదా?
ఇప్పటికే జగన్ వెంట సాగినందుకు ఎందరో కేసులలో చిక్కుకున్నారు. కొందరు జైలు పాలయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతే పార్టీలో యువత జీవితాలు కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది కదా?తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు యువత భవిష్యత్ పణంగా పెట్టిస్తున్నారు. ఇదేనా జగన్ యువతకు చేసే మేలు?




