మూడు రాజధానుల కధ ఎన్నికలతో సమాప్తం?

Jagan_Amaravati_Three_Capitalsమూడు రాజధానుల పేరుతో మూడున్నరేళ్ళుగా మూడు ముక్కలాట ఆడుతున్న వైసీపీ ప్రభుత్వం, బహుశః ఇదే అంశంతో ప్రజలలో సెంటిమెంట్ రగిలించి వచ్చే ఎన్నికలలో లబ్దిపొందుదామని భావిస్తున్నట్లుంది. ఇంతకాలం సంక్షేమ పధకాల డబ్బా తప్ప విశాఖ రాజధాని గురించి పెద్దగా మాట్లాడింది లేదు. కానీ కేవలం సంక్షేమ పధకాలతోనే గట్టెక్కలేమని గ్రహించిందో ఏమో హటాత్తుగా విశాఖ రాజధాని అంటూ హడావుడి మొదలుపెట్టింది.

ADVERTISEMENT

అయితే నేడు ఏలూరులో పర్యటిచిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉంటుంది. అమరావతే రాజధాని అని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ కూడా చెప్పారు. మా పార్టీ కూడా దానికే కట్టుబడి ఉంది. మూడు రాజధానుల ఓ వెర్రి ఆలోచన. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోంది. ప్రతిపక్ష నాయకులు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఏపీ ప్రభుత్వం తీరు మార్చుకొంటే మంచిది,” అని సున్నితంగా హెచ్చరించారు.

ఒకవేళ వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోయి టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఎలాగూ అమరావతి రాజధాని అవుతుంది. ఒకవేళ వచ్చే ఎన్నికలలో వైసీపీయే గెలిచినా అది విశాఖను రాజధాని చేయలేదు. ఎందుకంటే పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే మూడు రాజధానులు ఏర్పాటు చేయలేక మూడున్నరేళ్ళుగా చేతులు పిస్సుకొంటూ కాలక్షేపం చేస్తోంది. వైసీపీకి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోగా ‘వైసీపీ మార్క్ పాలన’ ఏవిదంగా ఉంటుందో ప్రజలకు బాగా రుచి చూపించింది.

కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలవడం చాలా కష్టం. ఒకవేళ గెలిచినా బొటాబోటి మెజార్టీతో గెలవగలదు. అప్పుడు మూడు రాజధానులనే ఆలోచన కూడా చేయలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికే మొగ్గు చూపుతోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈరోజు మరోసారి స్పష్టం చేశారు. కనుక కేంద్ర ప్రభుత్వం సమ్మతి, సహాయసహకారాలు లేనిదే వైసీపీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అంటే మిగిలిన ఈ కొన్ని నెలల్లో వైసీపీ నేతలు మూడు రాజధానులు పేరుతో చేసే రాజకీయ డ్రామాలతో ఈ కధ ముగియబోతోందని భావించవచ్చు.

Watch and Subscribe for Exclusive Industry Interviews:

ADVERTISEMENT
Latest Stories