ఈ నాలుగున్నరేళ్ళలో జగన్ ప్రభుత్వం చేసిన పనులలో కనబడుతున్నది ఒకే ఒక్కటి. అదే… విజయవాడలో రూ.404 కోట్లు వ్యయంతో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం.
ఆయన అడుగు జాడలలో నడుస్తూ బడుగు బలహీన వర్గాలను ఆదరిస్తూ వారికి సమాజంలో ఎదిగేందుకు సమానావకాశాలు కల్పిస్తుంటే ఈరోజు జగన్ సగర్వంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించవచ్చు. కానీ కోడి కత్తి కేసులో దళితుడైన శ్రీను 5 ఏళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారంటే దానికి కారణం జగనే కదా?
కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని అతికిరాతకంగా హత్య చేసిన ఎమ్మెల్సీ ఎవరు? వైసీపికి చెందిన వ్యక్తే కదా?
రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, సజీవ దహనాలు, మూత్రం పోసి అవమానించడం వంటి దారుణ ఘటనలు జరిగిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంటనే దోషులపై కటిన చర్యలు తీసుకున్నా నేడు ఎవరూ ఆయనను వేలెత్తి చూపగలిగేవారు కాదు. కానీ కనీసం స్పందించలేదు!
దళితులకు న్యాయం చేయలేనప్పుడు వందల కోట్లు ఖర్చు చేసి 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి గొప్పలు చెప్పుకోవడాన్ని ఏమనుకోవాలి?
పొరుగు రాష్ట్రాలతో అభివృద్ధిలో, పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడంలో పోటీ పడాలి కానీ ఇలా ఎత్తైన విగ్రహాలు నిర్మించడంలో కానే కాదు.
అయోధ్యలో రామమందిరం గర్భగుడిలో ఏర్పాటు చేస్తున్న బాల రాముడి విగ్రహం ఎత్తు కేవలం 4 అడుగుల మూడు అంగుళాలు మాత్రమే. కానీ అంతమాత్రన్న శ్రీరాముడి విలువ తగ్గిపోదు కదా?కనుక 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం కంటే ఆయన చూపిన మార్గంలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి.
రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యా, ఉద్యోగాలు, ఉపాధి కల్పించి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయాల్సి ఉండగా, సంక్షేమ పధకాల పేరుతో వారు ఎప్పటికీ ప్రభుత్వంపైనే ఆధారపడి బ్రతికేలా చేస్తోంది జగన్ ప్రభుత్వం.
అధికార కాంక్ష, అధికార మదంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకోవడం, ఎప్పటికీ మేమే అధికారంలోకి ఉండాలని కోరుకోవడం, అందుకోసం ఓటర్ల జాబితాలలో అవకతవకలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుండటం, వైసీపి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకోవాలనే దురాలోచనతో ఆ మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండటం వంటివన్నీ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లే ఉన్నాయి కదా?
జగన్ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ళలో ఏమీ చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసి ఉన్నా జగన్ చరిత్రలో నిలిచిపోయి ఉండేవారు. కానీ చేయకూడనివన్నీ చేసి కాశీకి వెళ్ళి గంగానదిలో మునిగితే చాలు… సకల పాపాలు కడిగేసుకోవచ్చన్నట్లు, కోట్లు ఖర్చు చేసి ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే చాలని జగన్ అనుకొన్నట్లున్నారు. కానీ చిత్తశుద్ధి లేని శివపూజలు ఎన్ని చేసినా ఫలితం లభించదని రాబోయే ఎన్నికల తర్వాత తెలిసి వస్తుంది.




