వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడు అంటూ వైసీపీ నాయకులు చేసే విమర్శలలో ఏ మేరకు వాస్తవం ఉందో ఈనాటికే రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత వచ్చినట్టే అనిపిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సమయంలో బాబు వ్యవస్థలను మేనేజ్ చేయగలిగితే జగన్ ఇప్పుడు ఈ పరిస్థితులలో ఉండేవారేనా? వ్యవస్థలను మేనేజ్ చేసే ప్రావిణ్యం చంద్రబాబుకే ఉన్నట్లయితే బెయిలు మీద పాదయాత్రలు చేసిన నాటి జగన్ జైలుకే పరిమితం అయ్యేవారేగా? బాబాయ్ గొడ్డలి పోటుని గుండె పోటుగా మార్చిన నేతలు ఇప్పుడు రాష్ట్రంలో పదవులను అనుభవిస్తూ ఉండేవారా? అంటూ టీడీపీ నేతలు ప్రశనిస్తున్నారు.
వందల కోట్ల అవినీతి అంటూ ఆధారాలు లేని ఆరోపణలతో చంద్రబాబు ని జైలుకు పంపిన జగన్ కొన్ని వేల కోట్ల అవినీతి కేసులలో A1 ముద్దాయిగా ఉన్నారు అనే వాస్తవాన్ని మరిచి చేస్తున్న విమర్శలు చూస్తుంటే వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే ఇదేనా? అనే చర్చ మీడియా వర్గాలలో ఊపందుకుంది. కోడి కత్తి కేసులో విచారణ ముందుకు సాగకపోవడానికి, జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టులకు హాజరు కాకుండా కాలాన్ని నెట్టుకొస్తున్న తీరుకి అసలు వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే ఇదేనా? అనే అనుమానం టీడీపీ నేతలలో మొదలైంది.
వివేకా హత్య కేసులో అనుమానితులుగా చెప్పబడుతున్న వైసీపీ నేత అవినాష్ రెడ్డి న్యాయస్థానాల ఎదుట హాజరు కాకుండా వేస్తున్న ఎత్తులు, ఆ కేసులో నిందుతుడిగా అనుమానించబడిన భాస్కర్ రెడ్డి బెయిలు మీద బయటకు రావడం, ఒక వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగడం చూస్తుంటేనే తెలుస్తుంది జగన్ మేనేజింగ్ టాలెంట్ అంటూ సోషల్ మీడియా వర్గాలలో చర్చ జరుగుతుంది. నన్ను అరెస్ట్ చేసి నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ సొంత పార్టీ ఎంపీ ఆర్ఆర్ఆర్ చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం. తన నిర్ణయాలను వ్యతిరేకిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనేదానికి సాక్ష్యాలుగా నాటి ఆర్ఆర్ఆర్ పాదాలు నిలిచాయా?
నిజంగా చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తే బాబు జైలు వెళ్లేవారేనా? ఒక వేళ వెళ్లినా బెయిలు మీద బయటకు వచ్చేవారేగా? అంటూ టీడీపీ శ్రేణులు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.వ్యవస్థలను మేనేజ్ చేసే జగన్ చంద్రబాబు ని జైలుకి పంపారా? వ్యవస్థలను మేనేజ్ చేసే జగన్, బాబుకి బెయిలు రాకుండా చేస్తున్నారా? వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే ఇదేనా? అంటూ ఎవరు ప్రశ్నించినా అది చట్ట వ్యతిరేకమే అవుతుంది.
రాజకీయ నాయకులకు వ్యవస్థల పై ఉండాల్సింది అనుమానం కాదు నమ్మకం. వ్యవస్థలు తమకు అనుకూలంగా తీరు ఇవ్వకపోతే వాటిని ఎవరో మేనేజ్ చేస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే వాటిని కించపరిస్తే ఇక సామాన్యులకు ఆచట్టాలమీద, అవి చేసే వ్యక్తుల మీద, వాటిని నడిపే వ్యవస్థల మీద ఏపాటి నమ్మకాన్ని కలిగిస్తాయో ఒక్క సారి ఆలోచించాలి. తమ రాజకీయ అవసరాలకు వ్యవస్థల పై విమర్శలు చేస్తే అవి తిరిగి తమకే వర్తిస్తాయి అనే వాస్తవాన్ని ఇప్పటికైనా జగన్ అండ్ కో గ్రహిస్తే మంచిది.



