మూడు రాజధానులు, విశాఖ రాజధాని, మావిగన్… ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం జగన్ చేసిన ప్రతిపాదనలు మాత్రమేననుకుంటే అది రాజకీయ అజ్ఞానమే అవుతుంది.
నిజానికి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో రాజధాని అనేది భౌగోళిక ప్రదేశమో, ప్రజల భావోద్వేగాలతో ముడిపడున్న అంశమో కాదు. అలాగే రాష్ట్ర ప్రతిష్ట, ప్రజల ఆత్మగౌరవానికి సంబందించినదీ కానే కాదు.
తన ప్రత్యర్ధిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు రాజధాని జస్ట్ ఒక వ్యూహం మాత్రమే. అందువల్లే జగన్మోహన్ రెడ్డి అంత తేలికగా రాజధానులు మార్చేయగలుగుతున్నారు. అమరావతి గురించి అంత చులకనగా మాట్లాడుతున్నారని భావించవచ్చు.
టీడీపి, జనసేన అమరావతికి కట్టుబడి ఉన్నాయి కనుక మూడు రాజధానుల ప్రతిపాదనతో మూడు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టి ఆ రెండు పార్టీలను రాజకీయంగా చావు దెబ్బ తీయాలనుకున్నారు. కానీ మూడు ప్రాంతాల ప్రజలు ఆ ఉచ్చులో పడలేదు.
అప్పుడు వెంటనే టీడీపికి కంచుకోట వంటి ఉత్తరాంద్ర జిల్లాలలో దెబ్బ తీసేందుకు ‘విశాఖ రాజధాని’ వ్యూహం అమలు చేశారు. ప్రజలను నమ్మించేందుకు రూ.500 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి రుషికొండపై విలాసవంతమైన ప్యాలస్లు నిర్మించుకున్నారు కూడా.
కానీ ఉత్తరాంద్ర జిల్లాల ప్రజలు, ముఖ్యంగా విశాఖ ప్రజలు జగన్ మాట నమ్మలేదు. ఆ ప్రతిపాదనకు మద్దతు పలుకలేదు.
ఈ రాజధానుల ప్రతిపాదనలకు ఒకవేళ ప్రజలు మద్దతు పలికి ఉంటే 2024 ఎన్నికలో మళ్ళీ వైసీపీయే గెలిచి ఉండేది. మళ్ళీ జగన్ సిఎం అయ్యుండేవారు కదా?
కనుక రాష్ట్ర ప్రతిష్ట, రాష్ట్రాభివృద్ధి, ప్రజల మనోభావాలు ముడిపడుతున్న అమరావతి విషయంలో గేమ్స్ ఆడకూడదని జగన్కు అర్ధమయ్యే ఉండాలి.
కానీ ఆయన దృష్టిలో రాజధాని జస్ట్ ఒక ప్లాన్ మాత్రమే. అందుకే ప్లాన్-ఏ బెడిసికొడితే ప్లాన్-బితో ‘మావిగన్’ అని ధైర్యంగా అనగలుగుతున్నారు.
ఇప్పుడీ ‘మావిగన్-వ్యూహం’ ఏమిటంటే, అమరావతి పేరుతో సిఎం చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని దుష్ప్రచారం చేస్తూ, ఈ మూడు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టి ఆయన పైకి ఉసిగొల్పడమే తప్ప మావిగన్ రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కానే కాదు. కనుక ‘మావిగన్ ప్రజలు’ కూడా ఈ ప్రతిపాదన వెనుక అసలు విషయాన్ని గ్రహించి తిప్పికొడితే తప్ప తగ్గే ప్రసక్తే లేదు.
జగన్ అదృష్టం ఏమిటంటే ఆయన ప్లాన్-బీ, సి, డీ… ఎక్స్, వై, జెడ్ అన్నా కూడా గుడ్డిగా వంతపాడే పార్టీ నేతలు, కార్యకర్తలు, కొందరు ప్రజలు కూడా ఉన్నారు.
తన రాజధాని ప్లాన్స్ గురించి పబ్లిసిటీ చేస్తూ, అమరావతిని, దానిని నిర్మిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుపై నిత్యం బురద జల్లేందుకు బలమైన సొంత మీడియా, సోషల్ మీడియా వారియర్స్ కూడా ఉన్నారు.
జగన్ మావిగన్ అన్నప్పుడు మొదట తడబడిన వైసీపీ నేతలే తర్వాత జై మావిగన్ అనక తప్పడం లేదు. అప్పుడే మావిగన్ పోస్టర్స్ కూడా ప్రత్యక్షమవుతుండటమే ఇందుకు చక్కటి నిదర్శనం కావా?
జగన్ ఏం చెప్పినా వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా ఎందుకు నమ్మేసి తాన తందాన పాడుతుంటారు? అంటే జగన్ ప్రతీ ఆలోచన వెనుక ప్రత్యర్ధులను రాజకీయంగా చావు దెబ్బ తీసే బలమైన వ్యూహం (కుట్ర) ఏదో ఒకటి ఉంటుందని నమ్ముతుండటం వల్లనే!
కనుక మావిగన్ కూడా మరో వ్యూహం లేదా కుట్రే తప్ప రాజధాని కాదని ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. మావిగన్ ప్రచారాన్ని నమ్మితే ఆంధ్రప్రదేశ్ కథ మళ్ళీ మొదటికొస్తుందని గుర్తుంచుకోవాలి.




