ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన జగన్, విశాఖ రాజధాని అన్నారు. కానీ చేయలేకపోయారు.
కనుక విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఎంతగానో దోహదపడే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో తాను కూడా పాల్గొనవచ్చు. లేదా సంఘీభావం తెలుపవచ్చు. లేదా వైసీపీ కార్యాలయాలలో యోగా డే చేయమని వైసీపీ శ్రేణులకు పిలుపు ఇవ్వవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం టీడీపీ లేదా సిఎం చంద్రబాబు నాయుడు సొంత కార్యక్రమం కాదు కనుక!
కానీ ఇవేమీ చేయకపోయినా ఎవరూ తప్పు పట్టలేదు. కానీ విశాఖలో జరిగే ఈ కార్యక్రమం నుంచి మీడియా, ప్రజల దృష్టి మళ్ళించాలనుకోవడం చాలా దుర్మార్గపు ఆలోచన. పల్నాడు జిల్లా రెంటపాళ్ళలో ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించే సాకుతో జగన్ బల ప్రదర్శన చేశారు.
జగన్ ఒక్క పర్యటనతో విశాఖలో జరిగిన యోగా కార్యక్రమం తుస్సు మందంటూ బొత్స సత్యనారాయణ చెప్పడం గమనిస్తే, జగన్ పరామర్శ యాత్ర దేనికో అర్దమవుతుంది.
జగన్ కారు కింద సింగయ్య అనే వృద్ధుడు చనిపోతే పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. కొన్ని నెలల క్రితం పాస్టర్ ప్రవీణ్ కుమార్ రాజమండ్రి సమీపంలో రోడ్ ప్రమాదంలో మృతి చెందితే జగన్, వైసీపీ నేతలు, వారి మీడియా మత రాజకీయాలు చేశారు. కానీ జగన్ కారు కింద పడి సింగయ్య చనిపోతే పోలీసులు జగన్పై కేసు నమోదు చేస్తే తప్పు పడుతున్నారు. ఇది రాజకీయకక్ష సాధింపే అని వాదిస్తున్నారు.
అయితే జగన్పై కేసు మాత్రమే కాదు.. ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారుని కూడా నల్లపాడు పోలీసులు స్వాధీనం చేసుకొని మరో షాక్ ఇచ్చారు.
ఆ కారు కింద పడి సింగయ్య మృతి చెందినందున కేసు విచారణ, సాక్ష్యాధారాల కోసం కారు (నంబర్: ఏపీ 40 డిహెచ్ 2349)ని స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి ప్యాలస్లో వైసీపీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డికి లిఖిత పూర్వకంగా తెలియజేసి పోలీసులు ఆ కారుని తమతో తీసుకువెళ్ళారు.
విశాఖలో యోగా కార్యక్రమం నుంచి అందరి దృష్టి మళ్ళించాలని దురాలోచన చేసిన జగన్, తన బలప్రదర్శనతో, సింగయ్య మృతి, రప్పా రప్పా డైలాగుతో అందరి దృష్టిని ఆకర్షించారనేది వాస్తవం.
కానీ ఓ మంచి పని చేస్తే ఫలితం ఒకలా ఉంటుంది. దుర్బుద్ధితో చేసే పనికి ఫలితం మరోలా ఉంటుంది.
విశాఖలో యోగా కార్యక్రమం చాలా సమర్ధంగా, విజయవంతంగా నిర్వహించినందుకు సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లని ప్రధాని మోడీ ప్రశంసించగా, దుర్బుద్దితో చేసిన బల ప్రదర్శన చేసిన జగన్ ఈ కేసులో చిక్కుకున్నారు.




