వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో అరటి రైతులని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలని ప్రస్తావిస్తూ సిఎం చంద్రబాబు నాయుడుకి నేరుగా అనేక ప్రశ్నలు వేశారు. అరటితో సహా పలు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించకపోవడం, రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి పలు అంశాల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు.
ఓ పక్క కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా రైతులకు ఏడాదికి రూ.20,000 చెల్లిస్తోందని చెప్పుకుంటోంది. వరి వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నామని చెప్పుకుంటోంది. రైతులు తమ ఉత్పత్తులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమ్ముకునేందుకు వీలుగా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పుకుంటోంది.
వీటన్నిటి కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పుకుంటూ మళ్ళీ వీటి ప్రచారం కోసం అదనంగా వందల కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ జగన్ ఇదంతా భూటకమే అని పలు సమస్యలను ప్రస్తావిస్తూ సిఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.
ఆయన ప్రతిపక్ష నాయకుడు కనుక ఎల్లప్పుడూ ఇలాగే కోడిగుడ్డుకి ఈకలు పీకుతూనే ఉంటారని మీడియా, ప్రజలు పట్టించుకోకపోవచ్చు. కానీ ఆయన లేవనెత్తిన అంశాలు, సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది!
స్పందించడం అంటే టీడీపి నేతలందరూ మూకుమ్మడిగా ఎదురుదాడి చేయడం కాదు. జగన్ చెప్పినవి నిజమే అయితే మొహమాటపడకుండా ఆ తప్పులన్నీ సరిచేసుకోవడమే చాలా మంచిది. అందువల్ల ఈ క్రెడిట్ జగన్కే దక్కినప్పటికీ, రైతుల సమస్యలని పరిష్కరించినందుకు సిఎం చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.
ఒకవేళ జగన్ రాజకీయ దురుదేశ్యంతోనే ఈవిదంగా అబద్దాలు చెపుతూ దుష్ప్రచారం చేస్తున్నట్లయితే, కూటమి ప్రభుత్వం రైతులకు అందించిన సహాయ సహకారాలను ప్రజలకు వివరించాలి. అలాగే గిట్టుబాటు ధరల విషయంలో జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒకవేళ నిజంగానే ఈ సమస్యలున్నాయని అనుకుంటే కూటమి ప్రభుత్వం వెంటనే వాటిని పరిష్కరించేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలి.
ఇక జగన్ విషయానికి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రైతులను ఎంతగా అవమానించారో, వేధించారో అందరూ కళ్ళారా చూశారు. సంక్షేమ పధకాలు, రాజకీయ కక్ష సాధింపులు తప్ప మరి దేనినీ పట్టించుకోలేదని అందరికీ తెలుసు,
కానీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను, వారి సమస్యలను పట్టించుకోని జగన్, ఇప్పుడు మెడలో పచ్చ కండువా వేసుకొని, పక్కనే అవినాష్ రెడ్డిని పెట్టుకొని రైతు సమస్యల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?
అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఆయన లేవనెత్తిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పి, లోపాలు ఉంటె సవరించుకోవడం చాలా మంచిది.
ఇలా చేయకుండా అహంభావంతో వ్యవహరించడం వల్లనే వైసీపీ ఓడిపోయింది. జగన్ ప్యాలస్లో ఒంటరిగా కాలక్షేపం చేస్తున్నారు.
కనుక జగన్ చేసిన తప్పులని కూటమి ప్రభుత్వం చేయకుండా, విమర్శలను స్వీకరించి లోపాలు ఉంటే సరిచేసుకోవడం చాలా మంచిది.




