వైసీపీ నేతలు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో నిన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసి సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంపై పిర్యాదు చేశారు.
కూటమి ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెట్టి వేదిస్తోందని, మాజీ సిఎం జగన్ పర్యటనలలో భద్రత కల్పించడం లేదని, ఆయనపై కూడా తప్పుడు కేసులు నమోదు చేస్తోందని వారు గవర్నర్కి పిర్యాదు చేశారు. ఇదెలా ఉందంటే ఇంట్లో మొగుడ్ని చితకొట్టిన పెళ్ళాం న్యాయం కోరుతూ పంచాయితీ పెట్టినట్లుంది.
వైసీపీ నేతల బియ్యం అక్రమ రవాణా, భూకబ్జాలు వంటివన్నీ కళ్ళకు కనబడుతున్న అవినీతి, అక్రమాలే. ప్రజలు జగన్ని నమ్మి అధికారం కట్టబెడితే చాలా పద్దతిగా మద్యం కుంభకోణం చేశారని ఆయన వీర విధేయుడు విజయసాయి రెడ్డే చెప్పారు కదా?
ఇక జగన్ పొదిలి, రెంటపాళ్ళ పర్యటనలలో ఏం జరిగిందో అందరూ టీవీ న్యూస్ ఛానల్స్లో కళ్ళారా చూశారు. వైసీపీ శ్రేణులు శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తుంటే, జగన్ వారికి అభివాదాలు చేస్తూ ప్రోత్సాహించారే తప్ప వారించలేదు.
“నా కారు కింద పడి మా పార్టీ కార్యకర్త సింగయ్య చనిపోతే మాకు బాధ కలగదా?ఆయన కుటుంబానికి వైసీపీ తరపున పది లక్షలు ఇచ్చామని” జగన్ స్వయంగా చెప్పుకున్నారు.
అంటే సింగయ్య చావుకి తానే కారణమని ఒప్పుకున్నట్లే కదా?ఆ కేసులో తనని అరెస్ట్ చేస్తారనే భయంతో జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు కూడా.
దానిని హైకోర్టు ఇంకా విచారణ చేపట్టనే లేదు. చేపట్టాక ఏం చెపుతుందో తెలుస్తుంది. కానీ ఈలోగానే వైసీపీ నేతలను గవర్నర్ వద్దకు పంపించి సిఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంపై ఎదురు పిర్యాదు చేయడం చూస్తే జగన్ అతితెలివి ప్రదర్శిస్తున్నారని అర్దమవుతుంది.
మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడప్పుడే అరెస్ట్ చేయారని నిశ్చింతగా ఉన్న జగన్, సింగయ్య మృతి కేసులో అరెస్ట్ చేస్తారేమోనని తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు స్పష్టమవుతోంది.
వైసీపీ నేతలు గవర్నర్కి ముఖ్యమంత్రిపై పిర్యాదు చేస్తూ ఫోటోలు దిగి తమ సొంత మీడియాలో అచ్చేసుకోవచ్చు. తమపై ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ప్రజలకు నచ్చజెప్పుకోవచ్చు. కానీ సింగయ్య మృతిపై పోలీస్ కేసు, కోర్టు విచారణ ఆగిపోవు కదా?




