రాజకీయాల్లో ఉండాల్సిన విలువల గురించి దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ చాలా గొప్పగా చెప్పారు. అయితే ఈయన గారి ప్రసంగాలన్నీ ‘మాటలకే పరిమితం’ అని, అవి చేతల్లో చూపించలేరని మరోసారి ప్రజలకు నిరూపించడానికి అధికార పార్టీ నేతలకు అవకాశం చిక్కింది. ఢిల్లీలో మీడియా మిత్రులతో మాట్లాడిన జగన్… “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా పట్టపగలే ప్రలోభాలకు గురిచేసి, మంత్రి పదవుల ఆశ చూపి, భయపెట్టో లేక బెదిరించో మా పార్టీ ద్వారా ఎన్నికయినా ప్రజాప్రతినిధులను తన పార్టీలోకి తీసుకున్నారు” అని విమర్శల వర్షం కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారడానికి రెండు రోజుల ముందు గవర్నర్ నరసింహన్ ను కలిసిన జగన్, మీడియా ముందుకొచ్చి… నేను తలచుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఒక్క గంటలో కూల్చగలను, 21 మంది అధికార పార్టీ నేతలు మాతో టచ్ లో ఉన్నారని, ఆ సంఖ్య మరి కొంచెం పెరిగే అవకాశం ఉందని, ఆ ‘మ్యాజిక్ ఫిగర్’కు చేరుకున్నాక ప్రభుత్వాన్ని ఒక్క గంటలో పడేస్తానని చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు తానూ చేయలేదని, ప్రభుత్వాన్ని పడగొడతానని తానూ అనలేదని ‘సో… కాల్డ్ మాట తప్పని మడమ తిప్పని నేత’ జగన్ మాట మార్చారనుకోండి… అది వేరే విషయం..!
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నానని ప్రతిపక్ష నేత అయిన జగన్ పరోక్షంగా చెప్పకనే చెప్పారు. మరి ఆయనతో టచ్ లో ఉన్న ఆ తెలుగుదేశం నాయకులను జగన్ ఎంత మొత్తం ఇచ్చి కొనుగోలు చేసారో లేదా ఏ ప్రలోభాలను రుచి చూపించారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ ను ప్రశ్నిస్తున్నారు. మరి 21 మంది ప్రభుత్వ ఎమ్మెల్యేలను టచ్ లో ఉంచుకోవచ్చు కానీ, నలుగురు ప్రతిపక్ష నేతలకు అధికార ప్రభుత్వం ‘పసుపు’ కండువాలు కప్పకూడదా అని అధికార పార్టీ వారు తమ పనిని పూర్తిగా సమర్ధిoచుకుంటున్నారు.
ఏపీలో రాజకీయ సమీకరణల మార్పుకు కారణం ఒక రకంగా జగనే దారి చూపించారని ఆ పార్టీలో నాయకులే అంతర్గతంగా అభిప్రాయ పడుతున్నారు. జగన్ అధికార పార్టీ ఎమ్మెల్యేలను టచ్ లో ఉంచుకొని ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం తప్పు కానప్పుడు, మరి మేము చేసింది తప్పేలా అవుతుందని పసుపు కండువా కప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.



