రాజకీయ నాయకులకు ఆశావహ దృక్పధం ఎక్కువగా ఉంటుంది. నిజానికి అదే వారిని రాజకీయాల్లో ఉండేలా చేస్తుంది. నేడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రేపు అధికార పక్షంలోకి వస్తాననే ఆశావహం వారిని ముందుకు తీసుకెళ్తుంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రతిపక్ష నేత జగన్ ఇదే రకమైన ఆలోచనలు చేస్తున్నారని విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చలకు దారి తీసాయి.
“వైసీపీ ప్రారంభించినపుడు నేను, అమ్మ మాత్రమే ఉన్నాం. ఆ తర్వాత 18 మంది ఎమ్మెల్యేలు మాతో కలిసి వస్తే, వారితో రాజీనామాలు చేయించి, ఎన్నికలకు వెళ్లి మళ్ళీ అందరినీ గెలిపించుకున్నాం. తదనంతర ఎన్నికలలో మా బలం 67కు పెరిగింది. ప్రజల్లో వైసీపీ పట్ల మక్కువ పెరుగుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా ప్రజల్లో మా స్థానం మాకుంటుంది” అంటూ భవిష్యత్తులో అధికారం చేపట్టబోయేది తామే అన్న విధంగా జగన్ వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇపుడే చెప్పలేం. అంచనాలు వేసిన విధంగా అన్ని సార్లు అందరికీ జరగకపోవచ్చు. అయితే వర్తమాన పరిస్థితులను బట్టి భవిష్యత్తును ఒక అంచనా వేస్తారు. అందులో భాగంగానే జగన్ ఆశావహ దృక్పధంతో ప్రసంగించి ఉంటారు. అయితే రాజకీయాల్లో… వర్తమాన పరిస్థితులను ఎవరికి వారు అంచనా వేసుకుని వెల్లడించే అంశాల కంటే, విశ్లేషకులు, నిపుణులు వ్యక్తపరిచిన భావాలకే అధిక ప్రాధాన్యత దక్కుతుంది.
ఈ క్రమంలో భవిష్యత్తులో వైసీపీ బలం పెరుగుతుందనే జగన్ వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయని, దీనికి జగన్ అవలంభిస్తున్న రాజకీయ విధివిధానాలే కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బలం పెరిగే సూచనలు పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న సంఖ్య కూడా నిలుస్తుందో లేదోనన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఎటువంటి మార్పు లేకుండా ప్రస్తుత రాజకీయ విధానాలతోనే జగన్ ముందుకు సాగితే, పెరిగే మాట దేవుడెరుగు… జగన్ తన రాజకీయ జీవితాన్ని ఏ సంఖ్యతో అయితే మొదలు పెట్టారో… మళ్ళీ అక్కడికే చేరుకునే ఆవకాశం లేకపోలేదని విశ్లేషిస్తున్నారు.



