రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది… ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేసేస్తోందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆక్షేపిస్తుంటారు. కనుక అయన అటువంటి పొరపాటు చేయరని ఆశించడం సహజం. కానీ రెడ్బుక్కి పోటీగా ఆయన ‘డిజిటల్ బుక్’ మొబైల్ యాప్ ఆవిష్కరించారు.
నేడు తాడేపల్లి ప్యాలస్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ యాప్ ఆవిష్కరించి, పార్టీలో రెడ్బుక్ బాధితులందరూ ఈ ‘డిజిటల్ బుక్’ యాప్లో తమ పేర్లు, ఎవరి వలన సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారి పేర్లు వివరాలు వగైరా నమోదు చేయాలని జగన్ సూచించారు.
వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ‘డిజిటల్ బుక్’ యాప్లో నమోదైన ప్రతీ పిర్యాదుపై చర్యలు తీసుకుంటామని, వైసీపీ వారిని వేధించినవారు ఎవరైనా, ఎంత పెద్ద స్థానంలో ఉన్నా వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు.
అంటే పార్టీలు, పుస్తకాల పేర్లు మారుతున్నాయి కానీ ఒకరు చేస్తున్న తప్పుని ఖండిస్తూ మరొకరు అదే తప్పు చేస్తామని ముందే చెపుతున్నారన్న మాట! కానీ రెడ్బుక్ తప్పని వాదిస్తున్నప్పుడు డిజిటల్ బుక్ తప్పు కాదా? అంటే కాదనే అనుకోవాలేమో?
ఈ ‘డిజిటల్ బుక్’లో మంచి చెడులను పక్కన పెట్టి చూస్తే, వైసీపీ తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం పార్టీ శ్రేణులకు దీంతో జగన్ కలిగించగలుగుతున్నారని చెప్పవచ్చు.
డిజిటల్ బుక్ ఓ రాజకీయ వ్యూహం కావొచ్చు… కానీ ఓటర్లు గుండెల్లో ఎంటర్ అవకపోతే, అది కూడా మరో ‘డేటా ఎంట్రీ’గానే మిగిలిపోతుంది.






