మాట తప్పని, మడమ తిప్పని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు ముందో మాట తర్వాతో మాట మాట్లాడుతుండటం ఆశ్చర్యకరమే.
ఇటీవల సీబీఐ కోర్టు అనుమతితో ఆయన లండన్ వెళ్ళి వచ్చారు. తిరిగి రాగానే కోర్టులో స్వయంగా హాజరవుతారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు హామీ ఇవ్వడంతో కోర్టు ఆయన విదేశీ పర్యటనకు అనుమతించింది.
నవంబర్ 14లోగా కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ లండన్ నుంచి తిరిగి వచ్చి నెలరోజులు పైనే అయినా ఇంతవరకు సీబీఐ కోర్టు ఎదుట హాజరు కాలేదు. కోర్టు ఎదుట హాజరు కావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు.
జగన్ కోర్టుకు హాజరవ్వాలంటే ప్రభుత్వం భారీగా భద్రత ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, అది ప్రభుత్వానికి అదనపు భారమే అవుతుందని కనుక అయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ఒకవేళ తప్పనిసరయితే కోర్టుకు హాజరవుతారని లేకుంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరవుతారని ఆయన తరపు న్యాయవాది సీబీఐ కోర్టుని అభ్యర్ధించారు.
లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి కోరినప్పుడు జగన్కి ఈ విషయం తెలియదా?తిరిగి వచ్చిన తర్వాతే గుర్తు వచ్చిందా?అంటే కాదనే అర్ధమవుతోంది.
అప్పుడు లండన్ పర్యటనకి కోర్టు అనుమతి తప్పనిసరి. కనుక మరో మాట చెప్పకుండా ఈ షరతుకి ఒప్పేసుకున్నారు. కానీ ఇప్పుడు కోర్టుకి వెళ్ళకూడదని అనుకుంటున్నారు. కనుక భద్రత, భారం అని కుంటిసాకులు చెపుతున్నారని అనుకోవలసి ఉంటుంది.
అయినా ప్రభుత్వం ఆయన భద్రత కోసం వందల కోట్లు ఖర్చు చేస్తూ జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నప్పటికీ ఇంకా ఎదో తక్కువైందని పదేపదే ఆరోపిస్తున్న జగన్, ఇప్పుడు ప్రభుత్వానికి భారం అవుతుందేమో? అని ఆలోచిస్తున్నారని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?






