జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారం వారం బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్నప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్ళి సంక్షేమ పధకాల గురించి ప్రచారం చేయమని ఆదేశిస్తే చాలా మంది వెళ్ళేవారు కారు. వెళ్ళకపోతే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వనని జగన్ బెదిరించాల్సి వచ్చింది. అయినా చాలా మంది వెళ్ళలేదు. కారణం అందరికీ తెలుసు.
అలాంటిది ఇప్పుడు ప్రజలు తమని 11 సీట్లతో తిరస్కరించిన తర్వాత గడప గడపకు వెళ్ళి తన హయంలో అమలు చేసిన సంక్షేమ పధకాల గురించి, చంద్రబాబు నాయుడు చేస్తానని చెప్పి చేయనివాటి గురించి ప్రజలకు వివరించమంటే వెళ్తారా? అంటే కాదనే అర్దమవుతోంది.
సుపరిపాలన తొలిఅడుగు పేరుతో కూటమి ప్రభుత్వం నెల రోజుల పాటు ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమం ప్రకటించి మొదలుపెట్టింది.
కనుక జగన్ కూడా దానికి పోటీగా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ ( చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తు తెస్తూ) అనే పేరుతో 5 వారాల కార్యక్రమం ప్రకటించారు.
పార్టీ నేతలందరూ గడపగడపకు వెళ్ళి తన హయంలో అమలుచేసిన పధకాలు, వాటి వలన ప్రజలకు కలిగిన ‘మేలు,’ చంద్రబాబు నాయుడు హామీలు. వాటిని అమలుచేయకపోవడం వలన కలుగుతున్న ‘నష్టం’ని రూపాయలలో లెక్క కట్టి ప్రజలకు వివరించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఇరుగు పొరుగు రాష్ట్రాలు, రాజకీయనాయకులు, ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ నేటికీ సంక్షేమ పధకాలు అమలు చేయడమే చాలా గొప్ప విషయమని జగన్ గట్టిగా నమ్ముతున్నారన్న మాట! అందుకే వాటి గురించి చెప్పమని వైసీపీ నేతలను ప్రజలపైకి తోలుతున్నారు.
ఏడాదిగా తాడేపల్లి ప్యాలస్కే పరిమితమైన జగన్, తాను లేని ఈ ఒక్క ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగిపోయిందనే విషయం కనిపెట్టి నిత్యం జనంలో తిరిగే పార్టీ నేతలకు నమ్మమని చెపుతున్నారు!
వైసీపీ నేతలను ఇంటింటికీ వెళ్ళి తమ పధకాల గురించి చెప్పుమంటే మంచిదే. కానీ వాటి గురించి గొప్పగా చెప్పుకునేందుకు చంద్రబాబు నాయుడు అమలుచేస్తున్న పధకాల గురించి వివరించమనడం, వెళ్ళిన ప్రతీ చోట సిఎం చంద్రబాబు నాయుడు పేరుని స్మరించమనడం చూస్తే ఇదేదో హిరణ్య కశిపుడు కధలా అనిపిస్తోంది కదా!
జగన్ ఇచ్చిన ఈ కార్యక్రమం చూసి వైసీపీ నేతలు ఇదెక్కడి టార్చర్ మహాప్రభో!అని అనుకోకుండా ఉంటారా?




