ఈరోజు తెనాలి పర్యటన పెద్ద రాజకీయ తప్పిదమని, అది పూర్తయిన తర్వాత జగన్ గ్రహించినట్లున్నారు. గుంటూరు, తెనాలి, ఒంగోలు, టంగుటూరు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్స్గా అనేక కేసులలో ముద్దాయిలుగా ఉన్నవారిని పరామర్శించడంతో జగన్ అరాచక శక్తులను వెనకేసుకువస్తున్నారనే భావన ప్రజలకు కలుగుతుందని ముందే చెప్పుకున్నాము.
తన పర్యటన ద్వారా ప్రజలకు అటువంటి తప్పుడు సాంకేతాలే వెళ్ళాయని జగన్ గ్రహించినట్లే ఉన్నారు. రౌడీ షీటర్ చేబ్రోలు జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మాట్లాడిన మాటలు వింటే ఈవిషయం అర్దమవుతుంది.
“నేను ఆ పిల్లలని (రౌడీ షీటర్స్)ని వెనకేసుకు రావడం లేదు. వయసులో ఉన్న పిల్లలు తప్పులు చేయడం సహజం. తప్పులు చేస్తే కేసులు నమోదవుతాయి. వాళ్ళపై కూడా ఆవిదంగానే కేసులు నమోదయ్యాయి.
అయితే వారు తప్పు చేశారా లేదా?అని ప్రభుత్వమో, పోలీసులో తీర్పు చెప్పకూడదు. న్యాయస్థానాలు ఆ కేసులను విచారించి వారు దోషులో కాదో నిర్ధారిస్తాయి. కానీ ఈ కూటమి నేతలు, పోలీసులే వారు దోషులని తీర్పు చెప్పేస్తున్నారు. దీనినే నేను వ్యతిరేకిస్తున్నాను. అందుకే నేను తెనాలి వచ్చాను,” అని జగన్ సమర్ధించుకున్నారు.
మహిళల మెడలో గొలుసులు తెంపుకుపోవడం మొదలు హత్యల వరకు రకరకాల నేరాలు చేసిన వారిని జగన్ ‘పిల్లలు’ అని సంభోదించడమే తప్పు.
వారికి ధైర్యం చెప్పడానికి వచ్చి వారిని వెనకేసుకు రాలేదని అబద్దం చెపితే ప్రజలు అర్దం చేసుకోలేరని జగన్ భావిస్తున్నట్లున్నారు.
పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానాలకే అప్పజెపుతారని 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన జగన్కు తెలియదా?
కానీ వారిపై కేసులు నమోదు చేయడమే తప్పని జగన్ భావిస్తున్నట్లున్నారు. అందుకే వారికి ధైర్యం చెప్పేందుకు తెనాలి వచ్చి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు చేసేదేమీ లేక వారిని నేను వెనకేసుకు రావడం లేదని నమ్మబలుకుతున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ని కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన రోజనుకొని ‘వెన్నుపోటు దినం’ జరపాలనుకోవడం, ఇప్పుడు రౌడీ షీటర్స్ని పరామర్శించేందుకు తెనాలి పర్యటన వంటివి చూస్తుంటే జగన్కి పార్టీలో ఎవరో ఇంకా శల్య సారధ్యం చేస్తున్నారని అర్దమవుతోంది.




