సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు సినిమాలు విడుదల చేస్తున్నప్పుడు వాటి దర్శకులు పదేపదే ఓ మాట చెప్పారు. “ఇవి కేవలం వినోదం కోసం. కనుక లాజిక్కులు వెతక్కుండా హాయిగా సినిమాని ఎంజాయ్ చేయండి,” అని చెప్పారు. కనుక ప్రజలు కూడా వాటిని అలాగే చూసి ఆదరించారు.
కానీ రాజాసాబ్లో సినిమాలో చాలా బలమైన కధ ఉందని మారుతి గట్టిగా చెప్పారు. కనుక ప్రేక్షుకులు ఆ నమ్మకంతోనే థియేటర్లకు వెళ్ళారు. కానీ సినిమాలో లాజిక్కు లేదంటూ ప్రేక్షకులు విమర్శించారు. ఆ లాజిక్ మీకు అర్థం కాలేదని మారుతి సర్ది చెప్పారు.
కనుక ఒక్కోసారి లాజిక్ అవసరం ఉండకపోవచ్చు. ఒక్కోసారి అదే ముఖ్యం కావచ్చని స్పష్టమవుతోంది.
ఇంతకీ ఈ లాజిక్ చర్చ దేనికంటే జగన్ హయంలో భూముల రీసర్వే చేయించి , పట్టాదారు పాసుపుస్తకాలపై, సర్వే రాళ్ళపై జగన్ బొమ్మలు వేయించుకోవడంపై ఇటీవల టీడీపి, వైసీపీ నేతల మద్య జరిగిన వాగ్వాదాల వల్లనే.
రైతులకు వారసత్వంగా వచ్చిన భూములలో వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి జగన్ బొమ్మలతో సర్వే రాళ్ళు వేయించడం ఏమిటని టీడీపి నేతలు ప్రశ్నించారు. జగన్ బొమ్మ ఉన్నంత మాత్రాన్న ఆ భూములు జగన్వి అయిపోతాయా? అని వైసీపీ నేతలు వాదించారు.
ఈ అంశంపై ఇరువర్గాలు హోరాహోరీగా పోరాడుకున్నారు. కానీ దీనిలో లాజిక్ ఎలా వివరించాలో తెలియకపోవడం వల్లనే ఇంత యుద్ధం జరిగింది. వైసీపీకి చెందిన ఓ పెద్దమనిషి ఆ లాజిక్ అందరికీ అర్ధమయ్యేలా వివరించాడు.
ఆయన ఓ టీవీ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేబులో నుంచి రూ.20 నోటు బయటకు తీసి దానిపై ఉన్న గాంధీ బొమ్మని చూపిస్తూ “ఈ నోటు ఎవరిది? నాదా గాంధీగారిదా?” అని అడిగారు,
“అది మీ చేతిలో ఉంది కనుక మీదే,” అని యాంకర్ సమాధానం చెప్పారు.
“చూశారా? ఇదేవిధంగా పట్టాదారు పాసు పుస్తకాలపై, సర్వేరాళ్ళపై జగన్ బొమ్మ ఉన్నంత మాత్రాన్న అది ఆయనది అయిపోదు కదా?”అని ఆ పెద్ద మనిషి సర్వేరాళ్ళపై జగన్ బొమ్మ వెనుక లాజిక్ విడమరిచి చెప్పారు.
మన రాష్ట్రంలో ఇలాంటి జ్ఞానులు సరిపడినంత మంది లేకపోవడం వలననే ఇలాంటి అపార్ధాలు, అపోహలు ఏర్పడుతున్నాయి.






