రాజకీయాలలో వ్యూహాలు ఉంటాయి కానీ వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎల్లప్పుడు వ్యూహాలతోనే రాజకీయాలు చేస్తుంటారు. వాలంటీర్ల నియామకం మొదలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలనే డిమాండ్ వరకు అన్నీ అటువంటి వ్యూహాలే.
కానీ ప్రతీసారి తన వ్యూహాలు బెడిసి కొడుతున్నా తాను ప్రశాంత్ కిషోర్ కంటే గొప్ప వ్యూహకర్తని అని భావిస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే నమ్మించారు సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని కూడా.
ప్రజా పద్దుల కమిటీలో సభ్యత్వం పొందేందుకు వైసీపికి తగినంత (18 మంది) ఎమ్మెల్యేల బలం లేదని తెలిసి కూడా ఆయన చేత నామినేషన్ వేయించారు.
నిన్న ఒంటి గంట గడువు ముగుస్తున్నా ఎవరూ తన నామినేషన్ స్వీకరించకుండా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని రెండు గంటలసేపు శాసనసభ ఆవరణలో కూర్చోబెట్టారని వైసీపి విమర్శలు గుప్పించింది.
ఆ సమయంలో శాసనసభ సమావేశం జరుగుతోంది. కనుక పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి శాసనసభ ఆవరణలో కూర్చోనే బదులు ధైర్యంగా లోనికి వచ్చి సమావేశానికి హాజరై స్పీకర్ని, ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు కదా?కానీ అది జగన్ వ్యూహంలో భాగం కాదు.
తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నామినేషన్ వేసి వెళ్ళిపోయారు. అంటే పీఏసీ కమిటీలో సభ్యత్వం లేదా ఛైర్మన్ పదవి ఆశిస్తున్నామని స్పష్టంగా చెప్పిన్నట్లే కదా?
ఒకవేళ ఆయన నామినేషన్ వేసి ఉండకపోతే టిడిపి, జనసేన, బీజేపీలతో ఏకగ్రీవంగా కమిటీ ఏర్పాటు అయ్యేది. కానీ ఆయన వేశారు కనుక ఎన్నిక నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు.
ఇలా జరుగుతుందని కూడా జగన్కి ముందే తెలుసు. కనుక వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేత ఈ ఎన్నికని బహిష్కరిస్తున్నట్లు ప్రకటింపజేసి సొంత మీడియాలో సిఎం చంద్రబాబు నాయుడుని, ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు. అంటే ఇందుకే ఆయన చేత నామినేషన్ వేయించి ఇంత డ్రామా ఆడారన్న మాట!
ఈ వంకతో సొంత మీడియాలో సిఎం చంద్రబాబు నాయుడుని తిట్టిపోసి జగన్ సంతోషపడి ఉండొచ్చు గాక కానీ ఈ సంతోషం కోసం సొంత పార్టీలో అందరి కంటే సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని జగన్ బకరా చేశారు కదా?అయినా సొంత తల్లిని, చెల్లినే వాడుకొని వదిలేసిన జగన్కు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఓ లెక్కా?




