ఏపీ, తెలంగాణలలో ప్రభుత్వాలతో పాటు రాజకీయాలు, రాజకీయ పరిస్థితులలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ముందుగా ఏపీ రాజకీయాలు గురించి చెప్పుకుంటే, కూటమి ప్రభుత్వం అభివృద్ధి మంత్రం పాటిస్తుంటే రాష్ట్రంలోని ఏకైక ప్రతిపక్ష పార్టీగా నిలుస్తున్న వైసీపీ ‘రప్పా రప్పా, మావిగన్’ అంటూ గుడ్డిగా ముందుకు సాగిపోతోంది.
వచ్చే ఎన్నికల నాటికి అమరావతి, పోలవరం ప్రాజెక్టులను ప్రజలకు చూపించి చంద్రబాబు నాయుడు ఓట్లు అడగబోతున్నారు. కానీ జగన్ అందరినీ భయపెట్టి ఓట్లు పొందవచ్చనుకుంటున్నారు.
వైసీపీ ఆశించినట్లు కనీసం కూటమిలో చిచ్చు ఏర్పడలేదు. నాయకత్వ సమస్య కూడా రాలేదు. సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మూడు పార్టీలు చక్కగా కలిసి పనిచేస్తున్నాయి.
భవిష్యత్లో సిఎం పదవి చేపడతారని భావిస్తున్న డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా మరోసారి సిఎం చంద్రబాబు నాయుడే మా ముఖ్యమంత్రి అని చెప్పేశారు.
ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధాలు, పార్టీల పరంగా ఎన్డీయేలో సంబంధాలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. కనుక ఈ విషయంలో కూడా వైసీపీ ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. ప్రస్తుత పరిస్థితులలో చేసిన ఉపయోగం ఉండకపోవచ్చు.
కనుక కేసులలో ఉపశమనంతో సరిపెట్టుకోక తప్పదు. కానీ అక్రమాస్తులు, మద్యం, వివేక హత్య కేసులు వైసీపీ నెత్తిపై కత్తిలా వ్రేలాడుతున్నంత కాలం అవి ఎప్పటికైనా ప్రమాదకరమే. వచ్చే ఎన్నికల సమయానికి వాటిలో కదలిక వస్తే ఇంకా ప్రమాదం.
కనుక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఉందని, వైసీపీకి కనుచూపు మేర ఆశాకిరణం లేదని స్పష్టమవుతోంది.
వైసీపీని మళ్ళీ అధికారంలోకి తెచ్చి తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఎటువంటి మంత్రందండమూ లేదు.
కానీ ‘మనమే వస్తాం రప్పా రప్పా ఆడిస్తాం..’ అని నేతలని, కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. బహుశః ఎన్నికలలోగా ఏదో అనూహ్యమైన రాజకీయ పరిణామం జరుగకుండా ఉంటుందా? అప్పుడు పరిస్థితి తనకు అనుకూలంగా మారకుండా ఉంటుందా? అని ఆశతో ఎదురుచూస్తున్నట్లున్నారు.
ఒకవేళ జగన్ మనసులో ఆలోచన ఇదే అయితే, పేదవాడు లాటరీ టికెట్స్ కొంటూ ఏదో రోజు లాటరీ తగలక పోతుందా? కోటీశ్వరుడు కాకపోతానా? అని ఎదురుచూస్తున్నట్లే చెప్పవచ్చు.




