జగన్ పర్యటనలలో కార్యకర్తలు అయన ఫోటోతో పోస్టర్స్ ప్రదర్శిస్తూ, “గంగమ్మ జాతర.. రప్పా రప్పా తలకాయలు నరుకుతాం..” అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన జగన్, ఇలాంటి ఫ్యాక్షనిజం పోకడలు సరికాదని వారిని మందలించి ఉండాలి. మళ్ళీ ఇలాంటి అరాచక పోకడలుపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించాలి.
కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వాదిస్తున్న జగన్, ‘రప్పా రప్పా నరుకుతాం’ అంటే తప్పేమిటి? అని అడుగుతున్నారు. వారిని వెనకేసుకువస్తున్నారు. అంటే ఫ్యాక్షనిజం, అరాచకానికే అయన మొగ్గు చూపుతున్నారనుకోవాలి.
‘మళ్ళీ నేను అధికారంలోకి వస్తే…’ అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా ఆవిధంగానే ఉన్నాయి. అందుకే వారు మాటిమాటికి రప్పా రప్పా అంటూ రెచ్చిపోతున్నారు. కనుక ఇదే ఆ పార్టీ సంస్కృతి లేదా విధానమని అనుకోవాల్సి ఉంటుంది.
‘నేను రప్పా రప్పా అంటే వైరల్ అవుతోంది. నా డైలాగ్స్ విని ప్రజలు చాలా ఆనందిస్తున్నారు..’ అని జగన్ అనుకుంటున్నారు. కానీ ఇలాంటి అరాచక పోకడలను ప్రోత్సహిస్తే ప్రజలు వైసీపీని చూసి భయపడి దూరమవుతారని గ్రహించడం లేదు.
ఈ అజ్ఞానం కూటమి పార్టీల పాలిట అదృష్టమనే చెప్పొచ్చు. కనుక జగన్, వైసీపీ కార్యకర్తలు ‘రప్పా రప్పా’ డైలాగ్ వదలకుండా కొనసాగించేలా చేయడమే కూటమి ప్రభుత్వానికి మంచిది.
ముఖ్యమంత్రిగా చేసిన జగన్ తీరు ఇలా ఉంటే, మంత్రి నారా లోకేష్ తీరు మరోలా ఉంది. టీడీపి మద్దతుదారులు జగన్ని పెట్టి చేసిన ఓ వీడియోని ఖండించారు.
ఆ వీడియోలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురూ కలిసి రోడ్డుపై నడుచుకువెళుతుంటే, “దయచేసి నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి,”అని వ్రాసున్న ప్లకార్డు పట్టుకొని జగన్ రోడ్డు పక్కనే నేలపై కూర్చున్నట్లు చూపారు. వారు ముందుకు సాగుతుంటే జగన్ లేచి వారికి ప్లకార్డు చూపిస్తూ వేడుకుంటున్నట్లు ఆ వీడియోలో చూపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మంత్రి నారా లోకేష్ దృష్టికి రావడంతో ఆయన దానిని ఖండించారు. “నా ప్రియమైన టిడిపి కుటుంబ సభ్యులకు, ఇలాంటి వ్యాఖ్యల వెనుక ఉన్న మీ భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ వ్యక్తిగత దాడులు ఎన్నడూ మంచివి కావు.
మన రాజకీయ ప్రత్యర్థుల పట్ల మనం మర్యాదతో, గౌరవంతో వ్యవహరించాలి. ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలను ప్రోత్సహించ వద్దని పార్టీలో అందరికీ మనవి చేస్తున్నాను. మనం వారితో ఏకీభవించకపోయినా మనం హుందాగా వ్యవహరిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి దోహదపడే నిర్మాణాత్మక రాజకీయాలపైనే మన దృష్టి పెడదాం,” అని ట్వీట్ చేశారు.
ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఓ యువ మంత్రి ప్రవర్తన, మాట తీరులో ఇంత తేడా ఉంది.
మాటలు, వ్యక్తిత్వం, నడవడిక, ఆలోచనలు, నిర్ణయాలు, విధానాలు అన్నీ సక్రమంగా ఉన్నవారినే సమాజం గౌరవిస్తుంది. అటువంటివారే జీవితంలో, ఎంచుకున్న రంగంలో రాణించగలరు. చరిత్రలో హిట్లర్, సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్ వంటివారు అందరినీ రప్పా రప్పా నరికేసి భయపెట్టి లొంగదీసుకోవాలనుకున్నారు. కానీ చివరికి వారే నాశనం అయిపోయారు. అలాంటి వారే ఆదర్శమనుకునేవారిని ఆ దేవుడు కూడా కాపాడ లేడు.






