రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే తాట తీస్తానని సిఎం చంద్రబాబు నాయుడు నిన్నే హెచ్చరించారు. కానీ జగన్ పరామర్శ పేరుతో వేలాదిమందిని వెంటేసుకొని గుంటూరు-విజయవాడ ప్రధాన రహదారిని ఆరు గంటలసేపు బ్లాక్ చేశారు. వైసీపీ శ్రేణులు జెండాలు పట్టుకొని రోడ్లపై బైక్ విన్యాసాలు చేస్తూ నానా హంగామా చేశారు.
ముఖ్యమంత్రి హెచ్చరించినప్పటికీ జగన్ పట్టించుకోలేదు. కనీసం వైసీపీ శ్రేణులు కూడా ముఖ్యమంత్రి హెచ్చరికలను ఖాతరు చేయలేదు.
మళ్ళీ ఈరోజు జోగి రమేష్-పరామర్శయాత్రకు జగన్ బయలుదేరారు. నిన్న చేసిన హడావుడి చూసిన పోలీసులు, ట్రాఫిక్కి అంతరాయం, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా పరామర్శయాత్ర చేసుకోవాలంటూ కొన్ని సూచనలు చేశారు. వాటి ప్రకారం రూట్ మ్యాప్ మార్చుకున్నారు కానీ ఎప్పటిలాగే మళ్ళీ రోడ్లన్నీ బ్లాక్ చేస్తూ ముందుకు సాగారు.
వైసీపీ శ్రేణులు ఈసారి మరింత రెచ్చిపోతూ బ్లేడ్లతో చేతులు కోసుకొని రక్తంతో జగన్ పోస్టర్లకు రక్త తిలకం దిద్దారు. బైక్ రేసులు, బైక్ విన్యాసాలు షరా మామూలే. పోలీసులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ వారిని కట్టడి చేయలేకపోయారు.
మాజీ సిఎంగా రాష్ట్రాన్ని ఐదేళ్ళు పాలించిన వ్యక్తి చట్టం, పోలీసులు ఎవరన్నా లెక్కలేనట్లు అరాచకంగా వ్యవహరిస్తున్నారని జగన్ యాత్రపై సిఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే సిఎం చంద్రబాబు నాయుడు ఎంత తీవ్రంగా హెచ్చరిస్తున్నా కనీసం వైసీపీ శ్రేణులు కూడా భయపడటం లేదని నేడు మరోమారు స్పష్టం అయ్యింది. ఇక్కడ మూడు విషయాలు గమనించాల్సి ఉంది. 1. వారిలో ఈ ధైర్యం నింపేందుకే జగన్ పరామర్శయాత్రలు చేస్తున్నారు. 2. తాను కనుసైగ చేస్తే చాలు వేలాదిమంది తరలివస్తారు. నేటికీ తన బలం ఏమాత్రం తగ్గలేదు. 3. ఇటువంటి బలప్రదర్శనలతో ప్రజలలో, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో భయం పుట్టించడం.
ఇదివరకు ఓ వైసీపీ నేత ఏమన్నారంటే, “మా అధినేత తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రానంత వరకే రాష్ట్రంలో మీ గవర్నమెంట్. ఒకసారి ఆయన కాలు బయట పెడితే ఇక మా గవర్నమెంటే. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు,” అని అన్నారు.
వైసీపీ సీనియర్ నేత రోజా సిఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి, “మా అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్లో నుంచి బయటకు రాకపోతే ఎందుకు రావడం లేదని మీరే అడుగుతారు. వస్తే ఇలా ఆవేశపడతారు. భయపడుతుంటారు.
అయినా మీరు చెప్పినట్లు నడుచుకోవడానికి, మీరు చెప్పిన రూట్లో పరామర్శయాత్ర చేసుకోవాల్సిన అవసరం మా అధినేతకు లేదు,” అన్నారు.
అంటే ‘మాకు నచ్చినట్లే మేం చేస్తాం తప్ప ప్రభుత్వాన్ని పోలీసులను ఖాతరు చేయమని’ ఖరాఖండీగా చెప్పారన్న మాట! ఈ ప్రభుత్వం, పోలీసులు, చట్టాలను మేము ఖాతరు చేయమని, అయినా మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని డొంక తిరుగుడు లేకుండా వారు చాలా స్పష్టంగానే చెప్పారు.
వారిరువురూ చెప్పింది అక్షరాల నిజమని జగన్, వైసీపీ శ్రేణులు నేడు మరోసారి నిరూపించి చూపారు. కనుక బంతి సిఎం చంద్రబాబు నాయుడు కోర్టులోనే ఉంది.






