రాజకీయ నాయకులు బహిరంగసభలలో ప్రజలకు ఏవైనా ముఖ్యమైన విషయాలు మరిచిపోకుండా చెప్పాలనుకొన్నప్పుడు వాటిని కాగితం వ్రాసుకు వస్తారు. కొందరు నేతలు తమ ప్రసంగాలను వ్రాసుకొని వచ్చి చదువుతుంటారు.
కానీ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్ధులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను నోరారా తిట్టాలనుకొన్నా కూడా వాటినీ కాగితం మీద వ్రాయించి తెచ్చుకొని, అది చూసి చదివి తిడుతుంటారు!
ఈరోజు శ్రీకాకుళం జిల్లా, పలాసాలో నిర్మించిన కిడ్నీ రీసర్చ్ సెంటర్, సుజలాధార ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో జగన్ పాల్గొన్నారు. ఉద్ధానం కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పుకొని ఉంటే ప్రజలు సంతోషించి వైసీపికి ఓట్లు వేసి ఉండేవారు.
కానీ జగన్ తన ప్రసంగంలో ఎక్కువసేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లని తిట్టిపోశారు. వారిని ఏవిదంగా ఎద్దేవా చేయాలో కాగితం మీద వ్రాసుకొచ్చి అది చూసి చదువుతుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
తెలంగాణలో ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్ధులను పోటీ చేయిస్తే కనీసం స్వతంత్ర అభ్యర్ధి బరెలక్కకి వచ్చినన్ని ఓట్లు కూడా ఎవరికీ రాలేదని, అందరూ డిపాజిట్లు కోల్పోయారని జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పారు.
స్వతంత్ర అభ్యర్ధికి వచ్చినన్ని ఓట్లు కూడా సాధించలేకపోయిన పవన్ కళ్యాణ్ని సిఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకొనవసరమే లేదు. కానీ విష్ణు సహస్రనామాలు చదువుతున్నట్లు జగన్ తన ప్రసంగంలో ఎక్కువ సేపు పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ అంటూ స్తుతిస్తూనే ఉన్నారు.
తాను ప్రజలను ఆకట్టుకొనేలా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నానని జగన్ అనుకొన్నారే తప్ప తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతూ తనలో అభద్రతా భావాన్ని స్వయంగా బయటపెట్టుకొంటున్నానని గ్రహించిన్నట్లు లేదు. టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తే వైసీపి నష్టపోతుందనే భయంతోనే జగన్ వారి నామస్మరణ చేస్తున్నారని ప్రజలకు తెలుసు. బరెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా సాధించలేకపోయిన పవన్ కళ్యాణ్ని చూసి జగన్ ఇంతగా భయపడుతుంటే, ఇంక నువ్వే మా నమ్మకం జగన్ అంటూ భజన చేస్తున్న తన పార్టీ నేతలకు ఏవిదంగా తన నాయకత్వంపై నమ్మకం కలిగించగలరు?




