తెలంగాణలో ముగిసిన ఎన్నికల రాజకీయ చదరంగాన్ని మించిన ఆట ఏపీ రాజకీయాలలో కనపడుతుంది. అందులోనూ ఈ రాజకీయ క్రీడ ముఖ్యంగా వైస్సార్ కుటుంభాల మధ్య మొదలవడంతో ప్రతిపక్ష పార్టీలతో పాటుగా తెలుగు ప్రజలు కూడా మరింత ఆసక్తిగా గమనిస్తున్నారు.
* పులివెందులలో జగన్ కు ప్రత్యర్థిగా టీడీపీ తరుపున పోటీపడడానికి సిద్ధంగా ఉన్న బిటెక్ రవిని ఈ రోజు జగన్ సొంత బావ బ్రదర్ అనిల్ ఇడుపులపాయలోని షర్మిల గెస్ట్ హౌస్ లో కలవడం ఏపీ రాజకీయాలలో “కన్ఫ్యూజన్ స్టార్ట్” అయ్యింది అనడానికి నాందిగా చెప్పొచ్చు. గత నెలలో జగన్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసింది అంటూ జగన్ పై ఘాటైన విమర్శలు చేసిన బిటెక్ రవితో ఇప్పుడు జగన్ బావ భేటీ…? కుమారుడి పెళ్లి పత్రిక అందించడానికి తల్లితో పాటుగా వధూవరులతో కలిసి తాడేపల్లి జగన్ ఇంటికి వెళ్ళిన షర్మిలతో అనిల్ ఎందుకు వెళ్లలేదనే ప్రశ్న తలెత్తింది.
* రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి తన నియోజకవర్గానికి, తనకి అన్యాయం జరిగిందంటూ గగ్గోలుపెట్టి ఇక వైసీపీలో చేరను, జగన్ ను కలవను అంటూ డైలాగ్లు చెప్పిన కరకట్ట కమలహాసన్ అదేలెండి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే వివాహ పత్రిక పట్టుకుని అన్నను కలవడానికి వెళ్లిన షర్మిలతో కలిసి జగన్ ను కలవడానికి వెళ్లి సెక్యూరిటీల చేతిలో భంగపడ్డారు. ఆర్కే కారుని జగన్ సెక్యూరిటీ కొంత సేపు ఆపి ఆతరువాత అనుమతిచ్చారు.
* ఇన్నాళ్లుగా తాడేపల్లి ప్యాలస్ కు దూరంగా ఉన్న తల్లి, చెల్లి ఒక్కసారిగా వివాహ ఆహ్వాన పత్రికతో జగన్ ను కలవడాన్ని తప్పుపట్టలేము కానీ కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకోవడానికి ముందే జగన్ కు పెళ్లి పత్రిక అందించి ఆ తరువాత జగన్ ప్రభుత్వ వైఫల్యాల చిట్టా అందించాలని భావించారో ఏమో కానీ ఢిల్లీ వెళ్ళడానికి ఒక్క రోజు ముందు జగన్ ను షర్మిల కలవడం అనుమానాలకు తావిస్తుంది.
*షర్మిల బాటలోనే నేను అంటూ మా “జగనన్న” అనే భజనకు స్వస్తి చెప్పి ఇప్పుడు అన్న స్థానంలో “షర్మిలమ్మా” అంటూ అమ్మ భజన అందుకున్నాడు ఈ కమలహాసన్ అంటూ ఆర్కే మీద సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ లో చేరుతాను అంటాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ పై, టీడీపీ అధినేత బాబు పై తన పోరాటం కొనసాగుతుంది అంటాడు. దీనితో ఈయనకు “కరకట్ట కమలహాసన్” బిరుదుతో పాటుగా కాంగ్రెస్ అభిమానులు “కన్ఫ్యూజన్ స్టార్”అనే బిరుదుని కూడా అందించారు.
* కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందాలు పెట్టుకుని చంద్రబాబే ఇదంతా చేస్తున్నారు అంటూ మొదలుపెట్టిన వైసీపీ నేతల విమర్శలు ఎంత ఫులిష్ గా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. గత ఎన్నికలలో టీడీపీ పార్టీ ఓటమికి ఒకరకంగా వైస్ షర్మిల కారణంగా నిలబడ్డారు. అలాగే గత ప్రభుత్వం నిర్ణయించిన ఏపీ రాజధాని అమరావతి నిట్టనిలువునా కూలిపోవడానికి మరోరకంగా ఆళ్ల రామకృష్ణ రెడ్డి కారణంగా నిలిచారు. దానితో పాటుగా బాబు పైన అనేక కేసులు వేసి టీడీపీ పార్టీని చాలా రకాలుగా దెబ్బకొట్టాలని చూసాడు ఆర్కే.
* ఇటువంటి వారి కోసం బాబు కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు చేసి కాంగ్రెస్ పార్టీ పగ్గాలను దగ్గరుండి అందిస్తారా..? ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ప్రయత్నాలు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి ఇన్ని రోజుల తరువాత పయనమవడం పలు అనుమానాలకు దారితీస్తుంది.రాజకీయాలలో ఎవరు ఎవరిని రాజకీయ కారణం లేకుండా కలవరు అనేది కాలం గడిచే కొద్ది బయటకు వస్తాయి.
* ఇలా ఎవరు ఎవరితో భేటీ అవుతున్నారు..?ఎవరు ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు..? ఎవరు ఏ పార్టీలో చేరుతున్నారు..? ఎవరు ఏ పార్టీ నేతల మీద తమ పోరాటాలు కొనసాగిస్తున్నారు..? ఏ పార్టీ ఏ పార్టీతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంది…? అనే ప్రశ్నలతో ఏపీ రాజకీయాలు కన్ఫ్యూజ్…కన్ఫ్యూజ్…ఇక స్టార్ట్ అయ్యింది కన్ఫ్యూజ్ అనే పాట మాదిరి తయారయ్యాయి.




