చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాల్సిన అమరావతిని నిర్ధాక్షిణ్యంగా పాడుబెట్టేశారు. విశాఖ రాజధాని పేరుతో చాలా హడావుడి చేసి ఋషికొండపై రూ.500 కోట్లతో జగన్ తన కోసం ప్యాలస్లు నిర్మించుకున్నారు.
ప్రజలు నమ్మి అధికారం అప్పజెప్పితే పాలకులు ఈవిదంగా ప్రవర్తిస్తుంటే ఏం చేయలేక ఎన్నికల వరకు ఎదురుచూసి మార్చేస్తుంటారు.
అయితే ఈ కక్షపూరిత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు తెలంగాణకు కూడా విస్తరించాయని బిఆర్ఎస్ పార్టీ నేతలు వాదిస్తున్నారు.
కేసీఆర్కి పేరు వస్తుందనే కాళేశ్వరం ప్రాజెక్టుని పాడుబెట్టేసి, ఎందుకూ పనికిరాదని దుష్ప్రచారం చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నారు. కేసీఆర్ని అప్రదిష్టపాలు చేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరగరానిదేదో జరిగిపోయిందంటూ విచారణలు జరిపిస్తోందని ఆరోపిస్తున్నారు.
కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజిలో పిల్లర్లు క్రుంగిపోవడం, మరికొన్ని బ్యారేజీలు దెబ్బతినడం వంటివి కళ్ళకు కనిపిస్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిలో నీళ్ళు నింపకుండా దిగువకు విడిచిపెట్టేస్తోంది.
ఒకవేళ రేవంత్ రెడ్డి కూడా జగన్లాగా కేసీఆర్పై అసూయతో నిర్ణయాలు తీసుకునే మాటైతే, హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులు మొదలుపెట్టేవారే కారు. కానీ మెట్రోని నగరంలో మరింత విస్తరించేందుకు రూ.24,269 కోట్లు వ్యయంతో కొత్తగా 5 కారిడర్లు నిర్మించేందుకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ శనివారం తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ని రాజకీయంగా ఎంత విభేదిస్తున్నప్పటికీ ఆయనపై కక్షతో నగరానికి, రాష్ట్రానికి నష్టం కలిగించకుండా ఆయన మొదలుపెట్టిన పనులను మరింత మెరుగుపరిచి కొనసాగిస్తున్నారన్న మాట!
అదేవిదంగా ఇదివరకు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఐటి రంగాన్ని అభివృద్ధి చేయగా, ఆయనని తీవ్రంగా ద్వేషించే కేసీఆర్, కేటీఆర్లు ఆ ద్వేషాన్ని పక్కనపెట్టి ఐటి రంగాన్ని మరింత అభివృద్ధి చేశారు. తత్ఫలితంగా గత పదేళ్ళలో హైదరాబాద్ ఐటి రంగానికి కేంద్రంగా మారింది.
కానీ ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన అమరావతి నిర్మాణ పనులు కొనసాగిస్తే ఆయనకి పేరొస్తుందనే అసూయతోనే దానిపై ‘కమ్మ ముద్ర’ వేసి పాడుబెట్టేశారు.
చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్తో రాజకీయంగా ఎంతగా విభేదిస్తున్నప్పటికీ, జగన్ హయాంలో మొదలైన భోగాపురం విమానాశ్రయ నిర్మాణం వంటి కొన్ని పనులను మరింత వేగవంతం చేయిస్తున్నారు.
రాష్ట్రంలో ఇటువంటి విధానాలు పాటించే ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఏ పెట్టుబడిదారుడు, పారిశ్రామికవేత్త అయినా రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాడు. ఈ విషయం పాలకులు అర్దం చేసుకున్నప్పుడు ఆ రాష్ట్రం, ఆ దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. లేకుంటే వారి రాజకీయాలకు, కక్షలకు ‘ప్లే గ్రౌండ్’లా మిగిలిపోతుంది. ప్రజలు ప్రేక్షకుల్లా మిగిలిపోతుంటారు.
ముగ్గురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రేవంత్ రెడ్డిల నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేటికీ ఒక్క మంచి విషయం కూడా నేర్చుకోలేదని ఆయన తీరు తెలియజేస్తోంది.






