మరో పరామర్శకు వేళాయే.. అందరూ రెడీయేనా?

Jagan To Visit Kakani Govardhan Reddy

వైసీపీ అధినేత జగన్‌ తమ నేతలకు పార్టీ కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత అప్పగించి, తాను వేరొక రకం రాజకీయాలు చేస్తున్నారు. అదే.. పరామర్శ యాత్రలు. ఇది కూటమి ప్రభుత్వంపై ఆయన అమలు చేస్తున్న ద్విముఖ వ్యూహంగా భావించవచ్చు.

ఆయన ప్యాలస్‌లో నుంచి కాలు బయట పెడితే అది పరామర్శ యాత్రకే అనుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయన కేవలం పరామర్శించడానికే బయటకు వస్తున్నారా?అంటే కాదని తెనాలి, పొదిలి, రెంటపాళ్ళ పరామర్శ యాత్రలు స్పష్టం చేశాయి.

ADVERTISEMENT

ఆ పేరుతో బలప్రదర్శన, ‘రప్పా రప్పా తలకాయలు నరికేస్తాం కొడకల్లారా..’ వంటి ఫ్లెక్సీలు ప్రదర్శింపజేస్తూ సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. తనకు భద్రత కల్పిస్తున్న పోలీస్ అధికారులను విమర్శిస్తున్నారు. బెదిరిస్తున్నారు. సిఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు అనుచిత వ్యాఖ్యలు సరేసరి!

ఇటువంటి బలప్రదర్శన ద్వారా వైసీపీ శ్రేణులలో ఆత్మవిశ్వాసం నింపాలని జగన్‌ ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతూనే ఉంది.

అలాగే ప్రతీ పర్యటనలో ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, తనకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం చూపుతోందని వాదిస్తున్నారు.

ఇవన్నీ కలిపి చూసినప్పుడు జగన్‌ పరామర్శ యాత్ర పేరుతో కొత్త రకం రాజకీయాలు చేస్తున్నారని అర్దమవుతోంది. అది ఫ్యాక్షన్ రాజకీయం కావడమే చాలా శోచనీయం.

తెనాలి, పొదిలి, రెంటపాళ్ళ పరామర్శ యాత్రలతో తన తడాఖా చూపించిన జగన్‌, జూలై 3న నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ముహూర్తం పెట్టేసి అప్పుడే దానిపై రాజకీయాలు మొదలుపెట్టేశారు కూడా.

జగన్‌ హెలికాఫ్టర్‌లో నెల్లూరు చేరుకోవాలనుకుంటున్నారు. ఆయనకు పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుంది కనుక నెల్లూరులో హెలికాఫ్టర్‌ ల్యాండింగ్ కోసం వారి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. కానీ టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ సొంత మీడియాలో ఓ స్టోరీ అచ్చేయించుకున్నారు.

తన పరామర్శ పర్యటనలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటం చూసి ఓర్వలేకనే సిఎం చంద్రబాబు నాయుడు తనని ప్రజల మద్యకు రాకుండా అడ్డుకుంటున్నారంటూ జగన్‌ కొత్త పాట అందుకున్న సంగతి తెలిసిందే. కనుక ఇప్పుడూ అదే పాట వినిపిస్తున్నారు.

అయితే పరామర్శకని బయలుదేరి బలప్రదర్శన చేయడం దేనికి? “పరామర్శ యాత్రకు విశేష స్పందన’, ‘పరామర్శ యాత్ర విజయవంతం’ అని జగన్‌ వైసీపీ నేతలు, వారి మీడియా చెప్పుకోవడం చూస్తే వాటి పరమార్ధం ఏమిటో అర్దమవుతుంది.

నెల్లూరు వైసీపీ నేతలకు జూలై 3కి జగన్‌ డేట్ ఇచ్చేశారు కనుక వారు కూడా ఆయనని మెప్పించేలా వైసీపీ కార్యకర్తలని పోగేసి ఆయన వెంట పరుగులు తీసేందుకు సిద్దంగా ఉంచాలి. వారికి రెచ్చగొట్టే ఫ్లెక్సీలు వగైరా సిద్దం చేసి అందించాలి.

అలాగే పోలీస్‌ అధికారులు కూడా జగన్‌ ఈసారి ఏం చేయబోతున్నారు?నెల్లూరులో ఏం జరుగబోతోంది?అని ముందే ఊహించుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది.

కానీ ఇలా ఎంత కాలం?అని టీడీపీ శ్రేణుల ప్రశ్నకు సిఎం చంద్రబాబు నాయుడే జవాబు చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories