కేవలం సినీ నటీనటులు మాత్రమే నటిస్తుంటారని అనుకోనవసరం లేదు. వారి కంటే గొప్పగా మన రాజకీయ నాయకులు నటించగలరు. పంచ్ డైలాగులు చెప్పగలరు. తమ నాటకీయతతో సభని రక్తి కట్టించి ప్రజలను మెప్పించగలరు.
అటువంటివారిలో సీనియర్ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఒకరు. ఆయన సంగారెడ్డి నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. కానీ 2023 ఎన్నికలలో ఓడిపోయారు. దాంతో ఆయన వ్యూహం మార్చారు. పదేళ్ళపాటు తాను ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించేశారు.
అలాగని తన సీటుని మరో కాంగ్రెస్ నేతకి అప్పగించాలనుకోలేదు. తన భార్య నిర్మల వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రకటించారు.
కానీ ఆమెకు భర్తలా మాటకారితనం లేదు. ముఖ్యంగా బహిరంగ సభలలో మాట్లాడలేరు. కనుక జగ్గారెడ్డే భార్యని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో జరిగే ప్రతీ కార్యక్రమంలో ఆమెని జనాలకు పరిచయం చేస్తున్నారు. కాస్త సెంటిమెంట్ కూడా పండిస్తున్నారు. అటువంటిదే ఆయన తాజా ప్రకటన.
సంక్రాంతి పండుగ వేడుకలలో ఆయన ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇక్కడున్న మీ అందరికీ తెలుసో తెలీదో నామీద అభిమానంతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించారు. మళ్ళీ 2023 ఎన్నికలప్పుడు ఆమె మనుమడు రాహుల్ గాంధీ కూడా నాకోసం ఇక్కడికి వచ్చారు.
ఆయనంతటి వాడు ఇక్కడికి వచ్చి నన్ను గెలిపించమని కోరితే మీరేం చేశారు? ఓడగొట్టారు! ఆయన మాటకు విలువ లేకుండా చేశారు. నేను ఓడిపోయినందుకు బాధ పడలేదు. రాహుల్ గాంధీని సంగారెడ్డికి ఆహ్వానించి అవమానించినట్లుగా భావిస్తున్నాను.
దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం పట్ల కృతజ్ఞత చూపని ఈ ప్రజల కోసం నేనెందుకు పోటీ చేయాలి? నా జీవితంలో మళ్ళీ సంగారెడ్డి నుంచి ఎన్నికలలో పోటీ చేయను,” అని జగ్గారెడ్డి శపథం చేశారు.
అలాగని భార్య నిర్మలని కూడా తప్పుకోమని చెప్పలేదు. చెప్పి ఉంటే ఆయన డ్రామా ఆడటం లేదని, నియోజకవర్గం ప్రజలపై అలిగి ఎన్నికల నుంచి తప్పుకున్నారని అనుకోవచ్చు.
కానీ ఈసారి నేను నా భార్య తరపున ఎన్నికల ప్రచారం కూడా చేయనని చెప్పారు. అంటే ఆమెకు ప్రజల సానుభూతి సంపాదించి పెట్టాడానికే జగ్గారెడ్డి ఈ డ్రామా ఆడుతున్నారనిపిస్తుంది.
రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకునే నాయకులు భార్య, కొడుకు, కూతురు ఎవరో ఒకరిని రాజకీయ వారసులుగా ప్రకటిస్తుంటారు. ఎన్నికల బరిలో దింపి గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తారు. జగ్గారెడ్డి కూడా ఆవిధంగా చేస్తే సరిపోయేది. కానీ ఇలా డ్రామాలు ఆడుతుంటే చివరికి ఆయనే నవ్వుల పాలవుతారు.






