ఆత్మసాక్షి అంచనాలు చాలా ఖచ్చితంగానే ఉన్నాయిగా… అయితే ఏపీలో కూడా?

JanaSena-TDP-YSRCP-Surveyమునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ పార్టీ విజయం సాధించబోతోందని అన్ని సర్వే సంస్థలు ముందే చెపేశాయి. వాటిలో ఆత్మసాక్షి కూడా ఒకటి. ఈ ఫలితాలపై దాని అంచనాలు చాలా వరకు ఖచ్చితంగా ఉన్నాయి. ఇదే సంస్థ రెండు నెలల క్రితం అంటే సెప్టెంబర్‌లో ఏపీలో కూడా సర్వే చేసి సర్వే ఫలితాలు ప్రకటించింది.

ADVERTISEMENT

ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే 90 సీట్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు గెలుచుకోగలదని తెలిపింది. అదే… జనసేనతో కలిసి పోటీ చేస్తే సుమారు 105 నుంచి 110 సీట్లు గెలుచుకోగలదని తెలిపింది. టిడిపితో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే జనసేన సుమారు 10-12 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని ఆత్మసాక్షి తెలిపింది. కానీ టిడిపి, జనసేన, బిజెపిలు మూడు కలిసి పోటీ చేస్తే మాత్రం వాటికి కేవలం 75 సీట్లు మాత్రమే వస్తాయని, అప్పుడు వైసీపీ పైచేయి సాధిస్తుందని చెప్పడం విశేషం. మూడు కలిసి పోటీ చేస్తే వైసీపీ సుమారు 95-102 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆత్మసాక్షి తేల్చి చెప్పింది.

మునుగోడు ఉపఎన్నికలపై ఆత్మసాక్షి చాలా ఖచ్చితమైన అంచనాలు వేయగలిగింది కనుక ఏపీ ఎన్నికలపై దాని అంచనాలు కూడా ఫలించే అవకాశం ఉందని భావిస్తే, వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మేమే గెలుచుకొంటామని సిఎం జగన్మోహన్ రెడ్డి చెపుతున్న మాటలు ఆత్మవంచన చేసుకోవడం లేదా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంగానే భావించవచ్చు.

అయితే బిజెపితో పొత్తులు పెట్టుకొంటే దాని వలన లాభం టిడిపి, జనసేనలు లాభపడకపోగా వైసీపీ గెలిచేందుకు తోడ్పడతాయనే కొత్త విషయం ఆత్మసాక్షి సర్వే సంస్థ చెప్పడం చాలా నిశితంగా గమనించాల్సిన విషయమే. ఏపీలో బిజెపికి పెద్దగా బలం, ప్రజాధారణ లేనప్పటికీ, అది టిడిపితో పొత్తులకి సిద్దపడితే, భారీగా సీట్ల కేటాయింపుకి ఒత్తిడి చేసి సాధించుకొంటుంది. ఇక జనసేన కూడా ఈసారి గట్టి నమ్మకంతోనే ఉంది కనుక అది కూడా భారీగానే సీట్లు కేటాయింపు కోసం ఒత్తిడి చేయవచ్చు. వాటి ఒత్తిళ్లకు తలొగ్గి టిడిపి గెలుచుకోగలిగిన సీట్లను వాటికి అప్పజెప్పితే అది వైసీపీకి అడ్వాంటేజిగా మారి ఆ సీట్లను అది కైవసం చేసుకొనే అవకాశం ఉంటుంది. కనుక టిడిపి, బిజెపి, జనసేనల పొత్తుల వలన వాటికంటే వైసీపీకే మేలు జరుగుతుందని ఆత్మసాక్షి సర్వేలో బయటపడింది.

అదే… టిడిపి, జనసేనలు మాత్రమే పొత్తులు పెట్టుకొంటే, టిడిపి తన సీట్లను తాను గెలుచుకోగలదు. ఒకవేళ జనసేనకు 20-25 సీట్లు ఇచ్చినా వాటిలో 10-12 సీట్లు గెలుచుకొన్నా అది వారి కూటమికి మరింత బలం చేకూర్చుతుందని ప్రజలు భావిస్తున్నట్లు ఆత్మసాక్షి సర్వే చేసి తెలియజేసింది.

వచ్చే ఎన్నికలలో టిడిపితో పొత్తులు పెట్టుకోబోమని బిజెపి నేత సునీల్ ధియోధర్ ఇటీవలే ప్రకటించారు. కనుక టిడిపి అందుకు సంతోషించవచ్చు. టిడిపి, బిజెపిల మద్య ఊగిసలాడుతున్న జనసేన ఎటువైపు ఉంటుందో తేల్చుకొంటే సరిపోతుంది. అది టిడిపివైపే ఉంటుందని వైసీపీలో సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు గల్లీ స్థాయి నేతల వరకు గట్టిగా వాదిస్తున్నారు. కనుక వారి వాదనలు నిజమవ్వాలని కోరుకొందాం.

ADVERTISEMENT
Latest Stories