తెలంగాణ జనసేనలో అప్పుడే చిచ్చా… ఇదేంటి మచ్చా?

Mekala Satheesh Reddy

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోట్లగిత్తలవంటి బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మద్య లేగదూడ వంటి జనసేన పోటీకి దిగడమే ఓ పెద్ద సాహసం. అలాంటప్పుడు అభ్యర్ధి ఎవరైనా ఒక్కటే. ఓటర్లకు పవన్‌ కళ్యాణ్‌ నచ్చితే ఓట్లు వేస్తారు లేకుంటే లేదు. కనుక టికెట్‌ కోసం కీచులాడుకోవడం అనవసరమే. కానీ సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధిగా బరిలో దిగుతున్న మేకల సతీష్ రెడ్డిపై నియోజకవర్గంలో జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

వారు మీడియాతో మాట్లాడుతూ, “ఈరోజు ఆయన (మేకల సతీష్ రెడ్డి) నామినేషన్ వేయడానికి ఇక్కడకు వచ్చి ప్రెస్‌మీట్‌ పెడుతున్నారు. కానీ మాకెవరికీ ఆయన వస్తున్నట్లే సమాచారం లేదు. మమ్మల్ని పట్టించుకోకుండా ఆయనకు తోచిన్నట్లు ఆయనకు చేసుకుపోతున్నాడు. ఎన్నికల సమయంలో కనీసం పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయకుండా, కార్యకర్తలని పట్టించుకోకుండా ఎలా పోటీ చేద్దామనుకొంటున్నాడు?ఎలా గెలుద్దామనుకొంటున్నాడు?ఆయన పార్టీని గెలిపించాలనుకొంటున్నాడా లేక ముంచేయాలనుకొంటున్నాడా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

కేంద్ర సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈరోజు కోదాడలో పర్యటించేందుకు వచ్చినప్పుడు జనసేన కార్యకర్తలు ఆయనను అడ్డుకొని నియోజకవర్గంతో సంబందమే లేని ఎన్‌ఆర్ఐ సతీష్ రెడ్డికి టికెట్‌ ఎలా ఇచ్చారని నిలదీశారు. వారికి ఆయన నచ్చజెప్పి శాంతింపజేసేందుకు ప్రయత్నించారు కానీ శాంతించకపోవడంతో ఆయన కారెక్కి వెళ్ళిపోయారు.

ఇక కోదాడలోని ప్రత్యర్ధుల బలాబలాలను ఓ మారు పరిశీలిస్తే, సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ పిసిసి అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కుటుంబానికి కోదాడ నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఈసారి ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచే పోటీ చేస్తున్నారు. ఆమె కోదాడలో రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉంటారు.

గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ఆమెను ఓడించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే బి. మల్లయ్య యాదవ్ కూడా ఈ 5 ఏళ్ళలో నియోజకవర్గంపై పట్టు సాదించారు. మళ్ళీ కోదాడ నుంచే పోటీ చేస్తున్నారు. దళిత నేతగా పేరున్న పిల్లిట్ల శ్రీనివాస్ బీఎస్పీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. వీరు కాక మరి కొందరు స్వతంత్ర అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.

పైగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌ గాలి వీస్తోంది. కనుక ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి అధికారం నిలుపుకోవాలని బిఆర్ఎస్ పార్టీ మరింత పట్టుదలగా పనిచేస్తోంది. ఇప్పుడు పార్టీ అభ్యర్ధిని స్థానిక కార్యకర్తలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పుడే అందిన తాజా సమాచారం ఏమిటంటే, తెలంగాణలో జనసేనకు ప్రాంతీయపార్టీగా గుర్తింపు లేనందున కేంద్ర ఎన్నికల కమీషన్‌ జనసేనకు దాని ఎన్నికల చిహ్నామైన గ్లాసుని గుర్తుగా ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో జనసేన తరపున 8 మంది వేర్వేరు గుర్తులతో స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేయవలసి ఉంటుంది. ఈ పరిస్థితులలో జనసేనకు విజయావకాశం ఎంత?సమాధానం అందరికీ తెలుసు.

ADVERTISEMENT
Latest Stories