పవన్ కల్యాణ్ అభిమాన సంఘం నాయకుడు కల్యాణ్ దిలీప్ సుంకరకు ఎట్టకేలకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ లభించింది. ఆదివారం పవన్తో భేటీ అయినట్టు కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పవన్ ను కలిసి చాలాసేపు మాట్లాడానని, ఇదో అద్భుతమైన అనుభూతని, తనను 41 రోజుల పాటు మెడిటేషన్ చేయమని చెప్పడంతో పాటు కొన్ని సూచనలు కూడా ఇచ్చినట్టు చెప్పారు.
ఆయన సూచన మేరకు ఈ 41 రోజులు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటానని తెలిపారు. వ్యవస్థతో పోరాడగలిగే శక్తి ఉన్నవాడివి స్థాయి తెలియని వ్యక్తులతో ఎంతకాలం పోరాడతావని పవన్ అన్నట్టు దిలీప్ సుంకర తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నారు. సోషల్ మీడియా విమర్శలకు దూరంగా ఉండగలిగేలా నియంత్రించుకోవాలని సూచించారని వివరించారు.
తనను కూడా ఎంతోమంది ఎన్నో అంటారని, వాటన్నింటికీ స్పందిస్తూ కూర్చుంటే గమ్యాన్ని చేరుకోలేమని పవన్ అన్నారని పేర్కొన్నారు. ఇటీవల దిలీప్ సుంకర జనసేన పార్టీ నేతలపై ఫేస్బుక్ వేదికగా నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. పార్టీలో తనను అవమానిస్తున్నారని, ఇక భరించడం తన వల్ల కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని, పవన్ అభిమానిగా కూడా ఇక ఉండదలచుకోలేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ ఆయనను కలిసి బుజ్జగించినట్టు సమాచారం. ఈ బుజ్జగింపుల పర్వంతో రొటీన్ రాజకీయాలలో పవన్ ‘జనసేన’ కూడా ఒక రొటీన్ పార్టీ అయిపోతుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే పవన్ రాజకీయ వ్యవహారంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.



