పవన్ కళ్యాణ్ పేరిట జనసేన పార్టీ సోషల్ మీడియాలో రెండు పేజీల పెద్ద లేఖను పోస్ట్ చేసింది. ఆ లేఖలో చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. “రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన- టిడిపిల పొత్తుకి ప్రధాని నరేంద్రమోడీ ఆశీస్సులు ఉన్నాయి. ఆయన ఆశీస్సులతో రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని కలిసి ముందుకు సాగుతున్నాయి,” అని పవన్ కళ్యాణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్కు మోడీ ఆశీస్సులు ఉన్నాయంటే అర్దం చేసుకోవచ్చు. కానీ బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకొంటే దానికీ ప్రధాని నరేంద్రమోడీ ఆశీస్సులు ఉన్నాయంటే అర్దం ఏమిటి?
అంటే బీజేపీ కూడా వాటితో కలిసి పనిచేయబోతోందని పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారా? అందుకే జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో భేటీ అయ్యారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. దీనికి జనసేన, బీజేపీలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఒకవేళ టిడిపి, జనసేనలతో బీజేపీ కూడా కలిస్తే దానికీ సీట్లు కేటాయించాలి. జనసేన కారణంగానే టిడిపితో కలిసి పనిచేసేందుకు బీజేపీ వస్తున్నట్లయితే, దాని కోసం జనసేన తన సీట్లను తగ్గించుకొంటుందా?అంటే కాదనే చెప్పాలి. తమకు కనీసం 40-50 సీట్లు కోసం జనసేన పట్టుబడుతుంటే 20-22 సీట్లు ఇస్తామని టిడిపి చెపుతున్నట్లు సమాచారం.
ఈ పరిస్థితిలో బీజేపీ కూడా చేరితే దానికీ సీట్లు ఇవ్వాలి కదా?ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం ఉంటే ఎన్ని సీట్లు తీసుకొన్నా తప్పులేదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోనీయము… వైసీపిని మళ్ళీ అధికారంలోకి రానీయము అని పవన్ కళ్యాణ్ పదేపదే చెపుతున్నప్పుడు, వైసీపి కోరుకొంటునట్లుగానే జనసేన వ్యవహరిస్తుండటాన్ని ఏమనుకోవాలి?




