లీకేజ్ అన్నది ఇటీవల కాలంలో సర్వ సాధారణం అయిపోయింది. గత కొంత కాలంగా లీకేజ్ బారిన పడని అగ్ర హీరో సినిమా లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ కోవలోనే జూనియర్ ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్”కు సంబంధించి ఇప్పటికే కొన్ని సీన్లు లీకై సోషల్ మీడియాలో సందడి చేసాయి. తాజాగా ఓ పాట కూడా లీక్ అయ్యి, అభిమానులను అలరిస్తోంది. అంతేకాదు, ‘జనతా గ్యారేజ్’ ఆల్బంపై మరింత అంచనాలు పెంచే విధంగా ఈ పాట ఉండడంతో అభిమానుల హంగామా మొదలైంది.
దేవిశ్రీప్రసాద్ అందించిన ఈ పాట క్యాచిగా ఉండడంతో ఇన్ స్టంట్ హిట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. అయితే మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన తొలి సినిమా “శ్రీమంతుడు” సినిమా ఆడియో ఆల్బమ్ విడుదలకు ముందు కూడా ఒక మెలోడీ పాట లీకై ప్రిన్స్ అభిమానులను అలరించింది. అయితే ఆడియో విడుదలైన తర్వాత తెలిసింది ఏమిటంటే… లీకైన పాట ‘శ్రీమంతుడు’ ఆల్బమ్ లో లేకపోవడం.
‘జనతా గ్యారేజ్’లో లీకైన పాటను దేవిశ్రీ ఆలపించినట్లే… ‘శ్రీమంతుడు’లో లీక్ అయిన పాటను దేవిశ్రీ సోదరుడు సాగర్ ఆలపించాడు. దీంతో అది ఖచ్చితంగా ‘శ్రీమంతుడు’ సినిమాదే అన్న బలం చేకూరింది. మరి లీకయ్యిందని దానిని తొలగించారో ఏమో గానీ, ‘జత కలిసే’ పాట రూపంలో మరో మెలోడీ ఆ స్థానాన్ని ఆక్రమించింది. మరి ‘జనతా గ్యారేజ్’ విషయంలో కూడా అదే ఫీట్ రిపీట్ అవుతుందో లేక లీకైన పాటను అలాగే ఉంచేస్తారో, ఆల్బమ్ విడుదలైన తర్వాత గానీ క్లారిటీ రాదు.



