రండి! అందరం కలిసి వ్యవస్థలను నిర్వీర్యం చేద్దాం!

Jogi Ramesh supporters rally after jail release

ఓ ఇల్లు నిర్మించడం ఎంతో కష్టం కానీ కూల్చేయడం సులువు. అదేవిధంగా వ్యవస్థలని సక్రమంగా నడిపించడం చాలా కష్టం. కానీ భ్రష్టు పట్టించేయడం చాలా సులువు. ఏవిధంగానో చూద్దాం.

నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్, తమ్ముడు రాము నిన్న రాత్రి విజయవాడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. వారి అనుచరులు వారికి ఘన స్వాగతం పలికారు.

ADVERTISEMENT

జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దానికి ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరు. నేను ఏ తప్పు చేయలేదు. కానీ రాజకీయ కక్షతోనే మాపై ఈ అక్రమకేసు పెట్టి జైల్లో పెట్టారు. నేను బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేస్తాను. నారా లోకేష్‌కి దమ్ముంటే అతను కూడా రావాలి. లేకుంటే నేనే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి నిలదీస్తాను,” అని అన్నారు.

తర్వాత వారిరువురూ అనుచరులతో కలిసి భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. వారి అనుచరులు రోడ్డుపై బాణాసంచా కాల్చుతూ, పెద్ద శబ్దం డిజే పెట్టి డాన్సులు చేస్తూ ఇబ్రహీంపట్నం వద్ద గల జోగి రమేష్ ఇంటికి ఊరేగింపుగా బయలుదేరారు. జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేసి మరీ వారు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ కేసు విచారణకు కేటీఆర్‌, హరీష్‌ రావులను పిలిచినప్పుడు కూడా అక్కడా ఇంచుమించు ఇలాగే వారు, అనుచరులతో చాలా హడావుడి చేశారు. ఇలాగే ప్రభుత్వాన్ని, విచారణాధికారుల ఆత్మస్థైర్యం దెబ్బ తినేలా మాట్లాడారు.

అవినీతి కేసులలో చిక్కుకున్నవారు ఈవిధంగా బలప్రదర్శనలు చేస్తూ, ముఖ్యమంత్రిని దూషించడం, పోలీస్ అధికారులను బెదిరించడం పరిపాటిగా మారిపోయింది. మందబలం ఉంటే ప్రభుత్వాలు తమని ఏమీ చేయలేవని నిరూపించి చూపుతున్నారు.

మంద బలంతో విచారణాధికారులు సైతం భయపడేలా చేస్తూ విచారణని ప్రభావితం చేస్తున్నారు. ఈ రాజకీయ క్రీడలో చివరికి పోలీసులే బలిపశువులు అవుతారని కేటీఆర్‌ అన్నమాట నూటికి నూరుశాతం నిజమని అందరికీ తెలుసు.

విచారణకు, జైలుకి వెళ్ళి వస్తున్నవారు సిగ్గుతో తలదించుకోవాలి. కానీ వారు తమని తాము హీరోలుగా ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు. తమ అవినీతిని బయటపెట్టిన ప్రభుత్వాలను, విచారిస్తున్న పోలీస్ అధికారులను దోషులుగా, విలన్లుగా అభివర్ణిస్తూ భయపడేలా చేస్తున్నారు. వారే ప్రజల ముందు తల దించుకునేలా చేస్తున్నారు.

వారు ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్నా రాజకీయ కారణాల వలన ప్రభుత్వాలు వారిపై కటిన చర్యలు తీసుకోలేని నిసహాయత. ముఖ్యమంత్రులు నాలుగు పంచ్ డైలాగులు పలికి చప్పట్లు కొట్టించుకొని సంతోషపడుతున్నారు.

ఈవిధంగా అధికార, ప్రతిపక్షాలు గాడి తప్పితే, అందరూ కలిసి పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తుంటే, చట్టాలలో లొసుగులతో న్యాయవ్యవస్థతో ఆటలాడుకుంటుంటే, ‘రాజకీయ కవచాలు’ మార్చుకుంటూ అవినీతి కేసుల నుంచి తప్పించుకుంటుంటే చివరికి అరాచకమే మిగులుతుంది.

ADVERTISEMENT
Latest Stories