హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్స్ ముగిశాయి. మొత్తం 150కి పైనే నామినేషన్స్ పడ్డాయి. వాటిలో కనీసం 100-125 మంది వెనక్కి తగ్గినా 25-50 మంది బరిలోనే మిగులుతారు. వారిలో అనామకులు సగం మంది అనుకుంటే మిగిలినవారు అందరూ ఓట్లు చీల్చేవారే.
ఇక కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్కి మజ్లీస్ అధినేత ఓవైసీ బహిరంగంగా మద్దతు ప్రకటించి, నియోజకవర్గంలో ముస్లింలందరూ ఆయనకే వేయాలని విజ్ఞప్తి చేశారు. కనుక ఆ ఓట్లన్నీ ఆయన పద్దులోనే పడతాయి.
బీజేపి, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్ధులు రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు చెందినవారు కాగా కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ ఆ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఓటర్లున్న బీసీ వర్గానికి చెందినవారు.
ఈ లెక్కలన్నీ కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి చేత మరో నామినేషన్ వేయించింది. కానీ ఇది మరో రాజకీయ తప్పిదంగా నిరూపితం కావచ్చు. ఈ నేపధ్యంలో చూస్తే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది.
కానీ కేటీఆర్, హరీష్ రావులతో సహా గులాబీ పార్టీ హేమాహేమీలందరూ జూబ్లీహిల్స్ని చుట్టుముట్టి ఏకధాటిగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కనుక వారి వ్యూహాలు ఫలితే బీఆర్ఎస్ పార్టీ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయినా ఆశ్చర్యం లేదు.
ఈ ఎన్నికలలో ఏ పార్టీ గెలిచినా గెలిచామని చెప్పుకోవడం తప్పితే పెద్ద తేడా ఉండదు. కానీ ఓడిపోతే పరువు పోతుంది. కనుక పోరాడాక తప్పడం లేదు.
ఇటువంటి పరిస్థితిలో సిఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా?అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఓడిపోతే పరువు పోతుందని తెలిసి ఉన్నప్పుడు ఏ అధినేత ఎన్నికల ప్రచారంలో పాల్గొనరు. అందుకే వారిద్దరూ పాల్గొనకపోవచ్చు.
ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమనిపిస్తే అప్పుడు సిఎం రేవంత్ రెడ్డి తప్పకుండా చివరి రోజున ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు. తద్వారా గెలిస్తే అ క్రెడిట్ ఆయనకు దక్కుతుంది. ఓడిపోతే ఆయన మొదటి నుంచి దూరంగా ఉన్నారు కనుక ఆ అప్రదిష్ట ఆయన పద్దులో జమా అవదు!
కానీ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న కూడా కేసీఆర్ రిస్క్ తీసుకోలేరు. ఎందుకంటే గెలిస్తే ‘పులి నిద్ర లేచిందని’ ఓ రెండు మూడు వారాలు డప్పు కొట్టుకోవచ్చు. అంతకు మించి మరే ప్రయోజనం ఉండదు కనుక!
కానీ బీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ స్వయంగా ప్రచారం చేసినా ఓటమి తప్పలేదు. ఇక అయన శఖం ముగిసినట్లే అని ప్రచారం మొదలైపోతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనపరుస్తుంది.
కనుక కేసీఆర్ ప్రచారానికి వెళితే అది కూడా రాజకీయ తప్పిదమే అవుతుంది. ఎలాగూ అయన ఫామ్హౌసులో నుంచి బయటకు రావడం మానేశారు. పార్టీని పట్టించుకోవడం మనేశారనే ముద్ర పడిపోయింది. కనుక దానిని భరించడమే ఆయనకు తేలిక.






