తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో… శశికళ వర్గానికి పన్నీర్ సెల్వం వర్గం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పన్నీర్ సెల్వం వర్గంలో ఉన్న అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదనన్… ప్రస్తుతం జైల్లో ఉన్న శశికళతో పాటు దినకరన్, వెంకటేశ్ లను అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం పళనిస్వామితో పాటు మంత్రివర్గ సహచరులను సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
అసలైన అన్నాడీఎంకే పార్టీ తమదేనని ఈ సందర్భంగా మధుసూదన్ ఉద్ఘాటించారు. అమ్మ జయలలిత అనుసరించిన పార్టీ నియమాలు, ఆదర్శాలను పళనిస్వామితో ఉన్న నేతలు ఉల్లఘించారని వివరణ ఇచ్చారు. జయలలితకు ఇచ్చిన మాటను వారు తప్పారని వ్యాఖ్యానించారు. అయితే, తమ పార్టీ నియమ నిబంధనల ప్రకారం అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ అయిన శశికళను సస్పెండ్ చేసే అధికారం ప్రిసిడియం చైర్మన్ అయిన మధుసూదన్ కు లేదని సెంగొట్టియన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
శనివారం అసెంబ్లీలో నిర్వహించనున్న బల పరీక్షలో తాము గెలుస్తామని ఈ సందర్భంగా సెంగొట్టియన్ విశ్వాసం వ్యక్తం చేసారు. తమ వైపు సరిపడ ఎమ్మెల్యేలు ఉన్నారని, పన్నీరు సెల్వం వర్గీయులు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం నిలబడుతుందని నమ్మకంగా చెప్పారు సెంగొట్టియన్. అయితే శనివారం నాడు జరగనున్న బలపరీక్షలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.



