ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ రాజకీయాలను, వాటి గురించి ఆయన మాట్లాడే మాటలను ఎవరూ సీరియస్గా తీసుకోరు. కానీ రాజకీయాలలో ఆయన మంచి కమెడియన్ అని అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారు.
కానీ ఆయనకు ఏ విలువా లేకపోతే కేంద్ర మంత్రులు, దేశాధినేతలు ఆయనతో సమావేశమవుతారా? అని ఆలోచిస్తే ఆయన మాటలలో ఎంతో కొంత నిజముందని అనిపిస్తుంది.
కానీ వాటిని ఆయన వివరించేటప్పుడు సొంత డబ్బా కొట్టుకోవడం, ఆయన ప్రదర్శించే హావభావాలు, దేశాధినేతలతో దిగిన ఫోటోలు, వీడియోలు ప్రదర్శిస్తుండటం వంటివి అయన మాటలకు విలువ లేకుండా చేస్తాయి.
తాజాగా ఆయన అమెరికా నుంచి విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో కల్వకుంట్ల కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఇదివరకు అంటే 2008 ఒకసారి ఆమె నన్ను కలిసి పదికోట్లు అడిగింది. నేను ఇదే విషయం కేసీఆర్కి చెప్తే, కవితని నమ్మొద్దు.. ఆమెకు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని కేసీఆర్ నాతో చెప్పారు. సొంత తండ్రే ఆమెను నమ్మరు. అందుకే ఇంతమంది నేతలు, ప్రజా ప్రతినిధులలో ఏ ఒక్కరూ ఆమెతో చేతులు కలపలేదు.
కేసీఆర్ హయంలో వారి కుటుంబం లక్షల కోట్లు పోగేసుకుంది. దానిలో వాటా, ముఖ్యమంత్రి పదవి కోసమే ఆమె గొడవ పడితే బయటకు సాగనంపారు. ఇప్పుడు ఆమె స్వయంగా ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నాను అని చెప్తున్నారు కదా?
ఆస్తులు, పదవుల కోసం గొడవలు పడి సొంత పార్టీ పెట్టుకున్న ఆమె, ఇప్పుడు తన వద్ద ఉన్న వేలకోట్ల అవినీతి సొమ్ము ఖర్చు చేస్తూ న్యూస్ పేపర్లలో ఫ్రంట్ పేజ్ ప్రకటనలు వేయించుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నారు కదా?
ఆమె తెలంగాణకు ఏదో మేలు చేయాలని రాలేదు. రాష్ట్రాన్ని దోచుకోవడానికే వస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రీస్టియన్, మైనార్టీలకు ఎన్నడూ అధికారం దక్కనీయకుండా అగ్రకులాలు వాళ్ళలో వాళ్ళే పంచేసుకుంటున్నారు.
వేలకోట్లు దోచుకున్నది సరిపోక ఇంకా లక్షల కోట్లు దోచుకోవడానికి, ముఖ్యమంత్రి పదవి కోసమే ఆమె సొంత పార్టీ పెట్టుకున్నారు తప్ప ప్రజల కోసమో రాష్ట్రంలో కోసమో కానే కాదు,” అని కేఏ పాల్ అన్నారు.




