మరో మూడు రోజుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “కబాలి” మొదటి షో పడబోతోంది. ఈ సినిమాకు జరిగిన పబ్లిసిటీ రీత్యా అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. దీంతో అభిమానులంతా రెట్టించిన ఉత్సాహంలో మునిగి తేలుతున్నారు. సాధారణంగా రజనీ సినిమా విడుదలవుతోంది అంటే… ఆయా ధియేటర్ల వద్దనున్న కటౌట్లన్నీ పాలాభిషేకంతో తడిసి ముద్ధవుతాయి. ఇక, ఈ రేంజ్ అంచనాలున్న ‘కబాలి’కైతే ఏకంగా ధియేటర్లను ‘తలైవా’ అభిమానులు పాలతో ముంచేసినా ఆశ్చర్యపడనవసరం లేదు.
సినీ అభిమానులు చేసే ఈ సంబరాలపై పలువురు మానవతావాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాలను రజనీ కటౌట్లకు వినియోగించే కంటే, పేదలకు దానం చేయడం ద్వారా ‘సూపర్ స్టార్’ ప్రతిష్ఠను మరింత పెంచవచ్చని వారు అభిమాన సంఘాలకు సూచనలు చేస్తున్నారు. ‘కబాలి’ విడుదల సందర్భంగా దాదాపు 20 లక్షల రూపాయల విలువ చేసే 50 వేల లీటర్ల పాలు నేలపాలయ్యే అవకాశం ఉందని పేర్కొన్న వారంతా… ఇలాంటి చెత్త సంప్రదాయాలకు రజనీ అభిమానులు చరమగీతం పాడి సరికొత్త ‘ట్రెండ్’కు పిలుపునివ్వాలని కోరుతున్నారు.
దేశంలో, రాష్ట్రంలో చాలా మంది పేదలు పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారని, కావాలంటే తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజున వారిని ఆదుకోవాలని తమిళనాడు పాల వ్యాపారుల సంఘం సభ్యులు ‘కబాలి’ అభిమానులను కోరుతున్నారు. నిజంగానే ఇలాంటి వృధా అభిమానానికి ‘శుభంకార్డు’ వేయాల్సిన తరుణం ఆసన్నమైంది. అభిమానం పేరుతో ప్రజల నిత్యావసర వస్తువులలో ఒకటైన పాలను వృధా చేయడం సాధారణం విషయం కాదు.
ఇది ఒక్క రజనీ అభిమానులు మాత్రమే చేస్తున్నది కాదు, ఇటు తెలుగులోనూ అగ్ర హీరోల అభిమానులు ఇదే రీతిలో ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సూపర్ స్టార్ అభిమానులే ‘ఎండ్ కార్డ్’ వేసి ‘ట్రెండ్’ సృష్టిస్తే… తమ అభిమాన హీరోకు చూపించే అసలైన అభిమానంగా భావించాలి. కాలం మారింది… ధియేటర్లు మారుతున్నాయి… అభిమానులు మారాల్సిన తరుణం ఆసన్నమైంది… ఈ మార్పు మంచిదే..!



