మాటల్లేవ్..చేతలే.. కడపలో సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవం !!

Nara Lokesh inaugurating solar power plant project in Kadapa district

రాష్ట్రాభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులు తప్పనిసరి అని వాదించేవారు వైసీపీ నేతలు. కానీ సువిశాలమైన భారతదేశానికి ఢిల్లీ ఒక్కటే రాజధానిగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు కాదు? అనే ప్రశ్నకు వైసీపీ సమాధానం చెప్పగలదా?

ఇంతకీ విషయం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళలోనే అటు చిత్తూరు నుంచి ఇటు ఇచ్చాపురం వరకు సమాంతరంగా అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాడు జగన్‌ చంద్రబాబు నాయుడుని ఆయన కుప్పం నియోజకవర్గంలోనే రాజకీయంగా దెబ్బ తీయాలనే దురాలోచనతో మొక్కుబడిగా కొన్ని అభివృద్ధి పనులు చేశారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా ఆయా జిల్లాలలో సహజ వనరులు, ఆయా జిల్లాలకు అనుకూలమైన వాటిని ఏర్పాటు చేస్తున్నారు.

ADVERTISEMENT

కడప జిల్లా జమ్మలమడుగులో విపరీతమైన ఎండలు, ఉష్ణోగ్రతలు ఉంటాయి. కనుక ఎస్ఏఈఎల్ అనే సంస్థ అక్కడ రూ.3,000 కోట్లు పెట్టుబడితో 300 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన రెండు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దానికి 2,400 ఎకరాలు కేటాయించారు.

కేవలం 11 నెలల్లోనే రెండు సోలార్ ప్లాంట్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మొదటి సోలార్ ప్లాంట్ ఈ ఏడాది జనవరి 30న, రెండవ ప్లాంట్‌ని మార్చి 13న కమీషనింగ్ కూడా చేశారు. ఈ రెండు సోలార్ ప్లాంట్స్ ద్వారా సుమారు వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించాయి. వీటిని మంత్రి నారా లోకేష్‌ నేడు ప్రారంభోత్సవం చేశారు.

కడప జిల్లాలోనే ప్రఖ్యాత స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘జేఎస్‌బ్ల్యూ’ రూ.16,350 కోట్లు పెట్టుబడితో జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్ళపల్లె, పెద్ద దండలూరు గ్రామాల మద్య 1,100 ఎకరాలలో భారీ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది.

మొదటిదశలో రూ.4,500 కోట్లు పెట్టుబడితో ఏడాదికి 10 లక్షల టన్నుల సామర్ధ్యంతో దీనిని నిర్మిస్తోంది. దీనిని ఎట్టి పరిస్థితులలో 2029, ఏప్రిల్లోగా ప్రారంభించాలని సిఎం చంద్రబాబు నాయుడు ముందే గడువు విధించారు. మొదటి దశలో ప్రత్యక్షంగా 1,000 మందికి దీనిలో ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా మరో 3-4,000 మందికి ఉపాధి లభిస్తుంది.

రెండో దశలోజేఎస్‌బ్ల్యూ సంస్థ రూ.11,850 కోట్లు పెట్టుబడితో మరో 20 లక్షల టన్నుల సామర్ధ్యంతో నిర్మిస్తుంది. ఈ రెండో దశ నిర్మాణ పనులు పూర్తిచేయడానికి డెడ్‌లైన్: 2034, ఏప్రిల్‌. రెండో దశ ఉత్పత్తి మొదలైతే మరో 1,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. శంకుస్థాపనలు చేసిన ప్రతీ పరిశ్రమని ఈవిధంగా నిర్దిష్టమైన గడువుతో పూర్తి చేయించి ఈవిధంగా ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు.

కడప జిల్లా ‘జగన్‌ కంచుకోట’ కనుక అక్కడ మనకు ఓట్లు పడవని సిఎం చంద్రబాబు నాయుడు అనుకోలేదు. కడప జిల్లా పట్ల ఏ మాత్రం వివక్ష చూపకుండా ఆ జిల్లాని కూడా మిగిలిన జిల్లాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చేస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories