బిఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు నేతల మీద న్యాయపోరాటం అంటూ ముందుకెళ్తున్న బిఆర్ఎస్ కు, ఆ పార్టీ అధిష్టానం కు కడియం శ్రీహరి ఎదురు ప్రశ్నలు సంధించారు.
గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సుమారు 36 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యే లను బిఆర్ఎస్ కారెక్కించారు. వారిలో ఇద్దరినీ మంత్రులుగా కూడా చేసారు. మరి అప్పుడు లేని నియమాలు బిఆర్ఎస్ కు, ఆ పార్టీ అధిష్టానానికి ఇప్పుడు గుర్తుకొచ్చాయా.?
నాడు చట్టబద్దమైన ఫిరాయింపులు నేడు చట్ట వ్యతిరేకమయ్యాయా.? అంటూ కడియం బిఆర్ఎస్ తీరును ఎండకట్టారు.నాడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ కారెక్కించేముందు, గులాబీ కండువా కప్పే సమయంలో వారితో కేసీఆర్ రాజీనామా చేయించారా.?
నాడు వారు పాటించని రాజకీయ విలువల గురించి నేడు ప్రవచనాలు ఇవ్వడం విడ్డురంగా ఉందంటున్నారు శ్రీహరి. అయితే నాడు ఫిరాయింపు నేతలను అడ్డుపెట్టుకుని తెలంగాణలో బిఆర్ఎస్ చేసిన రాజకీయం వాస్తవమే, అలాగే నేడు కడియం అడుగుతున్న ప్రశ్నలు సహేతుకమే.
నీవు నేర్పిన విధ్యేగా నీరజాక్షా అంటూ కడియం అడుగుతున్న ఆ ప్రశ్నలకు బిఆర్ఎస్ అధిష్టానం బదులు చెప్పగలదా.? రాజీనామాలు చెయ్యాలి అంటూ డిమాండ్ చేస్తూ ఆయా స్థానాలలో ఉపఎన్నికల కోసం ఎదురుచూస్తున్న కేటీఆర్ గతంలో తాము ప్రోత్సహించిన ఫిరాయింపులు కూడా అన్యాయమే, అప్రజాస్వామ్యమే అంటూ అంగీకరించగలరా.?





