చేనేత కార్మికులను నిండా ముంచేసిన కేసులో ప్రముఖ వస్త్ర దుకాణం ‘కళానికేతన్’ ఎండీ లీలాకుమార్, ఆయన భార్య, సంస్థ డైరెక్టర్ లక్ష్మీశారదలపై నమోదైన కేసులలో బెయిళ్ల పర్వం మొదలైంది. అనంతపురం జిల్లా ధర్మవరంలోని వందలాది మంది చేనేత కార్మికుల వద్ద వస్త్రాలు కొనుగోలు చేసి, తిరిగి రైతులకు డబ్బులు చెల్లించని పక్షంలో, బాధిత చేనేత కార్మికుల నుంచి ఫిర్యాదులు అందుకున్న ధర్మవరం పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని సంస్థ డైరెక్టర్ లక్ష్మీశారద దాఖలు చేసిన పిటిషన్ కు ధర్మవరం కోర్టు సానుకూలంగా స్పందించి, ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న లీలా కుమార్ కు ఇంకా పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. గత నెలలో నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులకు లీలాకుమార్ ఏ మాత్రం సహకరించలేదట. దీంతో లీలా కుమార్ ను మరోమారు తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల వినతికి కూడా ధర్మవరం కోర్టు అనుమతి ఇచ్చింది.
శుక్రవారం నాడు లీలాకుమార్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పలు అంశాలపై విచారణ సాగిస్తున్న తరుణంలో… కార్మికుల బకాయిలు చెల్లించే ఆర్థిక స్తోమత తనకు లేదని లీలాకుమార్ తేల్చిచెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక, ఆస్తుల సంగతులను ప్రశ్నించగా, దీనిపై లీలాకుమార్ నీళ్లు నమలగా… పోలీసులే వాటి వివరాలను శోధించి షాక్ తిన్నారట. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వున్న కళానికేతన్ షోరూంలతో పాటు, ఆ సంస్థ స్థిరాస్తులన్నీ ‘తనఖా’లోనే ఉన్నాయట.
దీంతో ఏం చేయాలో పాలుపోక, తలలు పట్టుకోవడం పోలీసుల వంతవుతోంది. తాజా పరిణామాలతో రైతుల చెల్లింపులు ఏ విధంగా జరుగుతాయనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది. పక్కా ప్రణాళిక ప్రకారమే లీలాకుమార్ ఇలా చేసారా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.



