తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని నిరూపించేందుకు ప్రయత్నిస్తుంటే, కేసీఆర్ని అప్రదిష్టపాలు జేసేందుకే కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది.
ప్రతీ దానికి ఏపీతో పోల్చి మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఈ ఒక్క విషయంలో మినహాయింపు ఇచ్చింది. ఎందుకంటే, అమరావతి విషయంలో తమ మిత్రుడు జగన్ కూడా ఇలాగే కుట్రలు చేశారని చెప్పలేదు కనుక!
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమీషన్ ఏడాదిపాటు వందలమందిని ప్రశ్నించి అనేక ఆర్ధిక, సాంకేతిక, రాజకీయ తదితర కోణాలలో విచారణ జరిపి సమగ్ర నివేదిక తయారు చేసి తెలంగాణ ప్రభుత్వం చేతికి ఇచ్చింది.
దానిని రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరూ మంగళవారం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమపై, తమ పార్టీపై బురద జల్లి రాజకీయంగా దెబ్బ తీసేందుకు కమీషన్ వేసి అనుకూలంగా నివేదిక తయారు చేయించుకుందని వారు హైకోర్టుకి మనవి చేసుకున్నారు.
తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ, రాజకీయంగా తమని దెబ్బ తీసేందుకు తయారు చేసిన ఆ నివేదికని రద్దు చేయాలని వారు హైకోర్టుని కోరారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నభూతో నభవిష్యత్ అని కధకధలుగా వర్ణిస్తూ గొప్పగా చెప్పుకునేవారు. మూడేళ్ళలోనే పూర్తిచేసి పలు జిల్లాలకు సాగుతాగు నీరు కూడా అందించారు.
కానీ ఆయన అధికారంలో ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్లో మూడు పిల్లర్లు క్రుంగిపోయాయి. మరికొన్ని బ్యారేజీల గోడలు బీటలు వారాయి. అప్పటి నుంచే మేడిగడ్డ బ్యారేజ్ వేదికగా రెండు పార్టీల మద్య రాజకీయ యుద్ధాలు మొదలయ్యాయి.
మొదట కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ బ్యారేజి క్రుంగిపోవడం, బీటలు వారడం చాలా చిన్న సమస్య అంటూ తేలికగా కొట్టి పడేసేవారు. కానీ కమీషన్ నివేదిక ప్రభుత్వం చేతికి రాగానే, మేడిగడ్డ బ్యారేజ్ని కాంగ్రెస్ నేతలే బాంబు పెట్టి పేల్చివేయాలని ప్రయత్నించారంటూ సరికొత్త ఆరోపణ చేసింది. అందువల్లే బ్యారేజి మూడు పిల్లర్లు క్రుంగిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తోంది. మరి ఇంతకాలం ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మేము ఇటువంటి కుట్ర చేస్తేఅప్పుడే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అనే కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పడం లేదు.
ఏది ఏమైనప్పటికీ, ఇప్పుడు ఈ కమీషన్ నివేదికని కొట్టి పడేయాలని హైకోర్టులో పిటిషన్ వేయడంతో వారివురూ ప్రమాదం శంకిస్తున్నారని స్పష్టమవుతోంది.
తాము అవినీతికి పాల్పడలేదని వారు వాదిస్తున్నప్పుడు ధైర్యంగా ఈ కేసును ఎదుర్కొని తమ వాదనలు నిజమని నిరూపించుకోవచ్చు. కానీ అలా చేయకుండా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ చేత తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపితే అది అబద్దమని, తాము చెప్పిందే నమ్మాలని కేసీఆర్, హరీష్ రావు హైకోర్టుని కోరడం చాలా హాస్యాస్పదంగా ఉంది… కదా?






