ఆంధ్రోళ్ల బిర్యానీ వద్దు…ఢిల్లీ మద్యం ముద్దా.?

Kalvakuntla Kavitha Andhra Biryani

మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్న సామెత మాదిరి సొంత రాష్ట్రంలో పార్టీ గెలవనందుకు కాదు పక్క రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీ గెలిచినందుకు అన్నట్టుగా కవిత తన బాధను, ఆవేదనను, అక్కసును సమయం చిక్కినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ పై కక్కుతూనే ఉన్నారు.

ADVERTISEMENT

బనకచర్ల మీద బిఆర్ఎస్ మొదలు పెట్టిన రాజకీయానికి కవిత నిత్యం ఎదో ఒక అంశంతో ఆజ్యం పోస్తూనే ఉన్నారు. బనకచర్ల ఏపీ అక్రమ ప్రాజెక్టు అని, పోలవరం నిర్మాణంతో భద్రాచలానికి ముప్పని ఇలా తలా తోక లేని ఆరోపణలతో కవిత తెలంగాణ రాజకీయాలలో తన అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఆరాటపడుతున్నారు.

ఏపీ నీటి ప్రోజెక్టుల పైన మొదలుపెట్టిన కవిత రాజకీయ లొల్లి ఇప్పుడు హైద్రాబాద్, ఆంధ్రా బిర్యానీల వరకు పాకింది. గతంలో అక్కడ బిఆర్ఎస్, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం నడుస్తున్న రోజులలో ఆంధ్రాకు వచ్చిన కేసీఆర్ అప్పటి ఏపీ పర్యాటక మంత్రి రోజా ఇంటికి వెళ్లి మరి రాగి సంకటి, చేపల పులుసు తిన్నారు.

అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి కేసీఆర్ ఆంధ్రా చేపల పులుసు కథతో బిఆర్ఎస్ పులుసు తీస్తున్నారు. అయితే దానికి కౌంటర్ గా కవిత ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, ఏపీ ముఖ్యమంత్రి బాబు ని పిలిచి హైద్రాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి ప్రోజెక్టుల కు అనుమతులిచ్చారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు.

అలాగే పనిలో పనిగా ఆంధ్రా బిర్యానీ మీద కూడా ఒక వివాదాస్పద కామెంట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చివాట్లు తింటున్నారు. పోలవరం – బనకచర్ల ప్రోజెక్టుల మీద మీడియాతో సమావేశమైన కవిత ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటదో కేసీఆర్ చెప్పినాడు కదా, మనం ఆంధ్రోళ్ల బిర్యానీ ఎం తింటంలే కానీ…అంటూ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీనితో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆంధ్రోళ్ల బిర్యానీ నచ్చదు కానీ, ఢిల్లీ మద్యం ముద్దా.? అంటూ కౌంటర్లు పేలుతున్నాయి. గులాబీ జెండాను పక్కన పెట్టి, బిఆర్ఎస్ సిద్ధాంతాలను మోస్తూ కవిత తెలంగాణ రాజకీయాలను జాగృతి పేరుతో ఆంధ్రా వైపుకు నెడుతున్నారు.

ఈ రాజకీయాలు కవిత జాగృతి కానీ కేసీఆర్ బిఆర్ఎస్ కానీ ఎంతవరకు ప్రయోజనాలను తీసుకువస్తాయో ఇప్పుడే చెప్పలేం కానీ ఇటు ఏపీలో మాత్రం కేసీఆర్ కుటుంబం పై తీవ్ర వ్యతిరేఖత పెరగడం ఖాయం. అది వైసీపీ కి కూడా అత్యంత ప్రమాదకరం.

ADVERTISEMENT
Latest Stories