పూరీ జగన్నాధ్ – ప్రిన్స్ మహేష్ బాబుల కలయికలో అత్యంత సాధారణంగా విడుదలై, ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులను కొట్టిన “పోకిరి” సినిమాలో క్లైమాక్స్ అసలు హైలైట్. అప్పటివరకు ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగిన సినిమాకు మాంచి ఊపు తెచ్చిపెట్టింది క్లైమాక్స్. దీంతో ఈ బొమ్మను ఒకటికి రెండు సార్లు చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు. ఫలితం… బాక్సాఫీస్ వద్ద ఎన్నడూ లేనంత కనకవర్షం కురిసింది.
తాజాగా పూరీ – కళ్యాణ్ రామ్ ల కలయికలో మరికొద్ది గంటల్లో విడుదలకు సిద్ధమవుతున్న “ఇజం”లో కూడా క్లైమాక్స్ అసలు హైలైట్ అంటున్నాడు హీరో కళ్యాణ్ రామ్. ఎవరూ ఊహించని విధంగా, అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా, చాలా సహజ సిద్ధంగా ఈ సినిమా ఎండింగ్ ఉంటుందని చెప్పారు. ఇప్పటివరకు సోషల్ ఎలిమెంట్స్ తో చాలా సినిమాలు వచ్చినప్పటికీ, మా ‘ఇజం’ మాత్రం కొత్తగా ఉంటుందని, పూరీ గారి ట్రీట్మెంట్ తో సాగుతుందని సినిమా విశేషాలను చెప్పుకొచ్చారు.
ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఇక నుండి కొత్తదనం ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఇస్తానని, అలాంటి సినిమాలనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని, ఖచ్చితంగా డిఫరెంట్ సినిమాలే చేస్తానన్న నమ్మకం నా మీద పెట్టుకోవచ్చని, ఇప్పటివరకు ‘ఇజం’ టీజర్లలో చూసింది చాలా తక్కువ, అసలు చూడాల్సింది ధియేటర్ లో ఉంది అంటూ సినీ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు నందమూరి కళ్యాణ్ రామ్.



