వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్ళ గ్రామంలో పర్యటించనున్నారు. ఆ గ్రామంలో వైసీపీ కార్యకర్త కొర్లకుంట నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్ వెళ్ళబోతున్నారు.
దీనిపై సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ, “వైసీపీ కార్యకర్త కొర్లకుంట నాగ మల్లేశ్వరరావు చావుకి కారణం జగన్మోహన్ రెడ్డే. ఈసారి ఎన్నికలలో 175కి 175 సీట్లు వైసీపీ గెలుచుకోబోతోందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. అలా నమ్మి మోసపోయినవారిలో మల్లేశ్వరరావు కూడా ఒకరు.
జగన్ మాటలు నమ్మి అతను ఇంట్లో ఉన్న పది లక్షలతో పాటు అప్పులు చేసి మరీ రెండు కోట్లు పందేలు కాశారు. కానీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడంతో అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.
జగన్పై నమ్మకంతో ఉన్నదంతా ఊడ్చిపెట్టి పందేలు కాయడంతో సర్వం కోల్పోయి మల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. కనుక ఆయన చావుకి జగనే కారకుడు. తన వలన చనిపోయిన ఆ కార్యకర్త కుటుంబానికి జగన్ చేసిందేమీ లేదు. కానీ రేపు ఆయన విగ్రహావిష్కరణ చేసి దండేయడానికి వస్తున్నారు.
ఇదెలా ఉందంటే అదేదో సినిమాలో రావుగోపాలరావు ఒక వ్యక్తిని రాత్రి హత్య చేయించి మర్నాడు ఉదయమే పువ్వులదండ పట్టుకొని వెళ్ళి సంతాపం తెలిపినట్లుంది,” అంటూ కన్నా లక్ష్మీనారాయణ అసలు విషయం బయట పెట్టారు.




