వైసీపీ కి ఒక కాపు నాయకుడు కావాలా.?

Kapus Key to AP Politics? YSRCP’s Search for a Leader

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముఖ్యంగా కులాధారంగా నడుస్తాయన్న సంగతి బహిరంగ సత్యమే. అయితే ఒక్కో ఎన్నికకు ఆ గెలుపుకు ఒక్కో సామాజికవర్గం కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వీటిలో కాపు సామాజికవర్గం ది ఒక ప్రత్యేకమైన స్థానమనే చెప్పాలి.

అయితే ఈ విషయాన్ని 2024 ఎన్నికలలో వైసీపీ చాల గట్టిగా గ్రహించినట్టుంది. 2019 ఎన్నికలలో 151 సీట్లతో ఎదురులేని విజయాన్ని అందుకున్నాం అనే విజయ గర్వంకు తోడు పవన్ రెండు చోట్ల ఓటమి వైసీపీ కి అంతులేని బలాన్ని ఇచ్చింది. దీనితో పవన్ పై వైసీపీ వ్యక్తిగత దాడి తారాస్థాయికి చేరింది.

ADVERTISEMENT

పవన్ తో పాటుగా ఆయన కుటుంబాన్ని, మాజీ భార్యలను రాజకీయాలలోకి లాగి పార్టీ అధినేత జగన్ నుంచి పార్టీ క్యాడర్ వరకు వారిని రాజకీయ వేదికలెక్కించారు. చివరికి పవన్ పిల్లలను సైతం వదిలిపెట్టకుండా వారి పై కూడా వైసీపీ తన అరాచకాన్ని కొనసాగించింది.

ఇక పవన్ టార్గెట్ గా వైసీపీ నడిపిన గత ఐదేళ్ల రాజకీయం ఆయన అభిమానులు, జనసేన మద్దతుదారులతో పాటుగా సామాన్య ప్రజలను బాధించాయి. అలాగే పవన్ ఓటమికై ముద్రగడను రంగంలోకి దింపడం, ఆయన పై విమర్శలు చేసేందుకు అదే సామాజికవర్గానికి చెందిని వైసీపీ కాపు నేతలను మీడియా ముందుకు తేవడంతో వైసీపీ కి కాపు సామాజికవర్గం పూర్తిగా దూరం జరిగింది.

ఫలితంగా ఆ సామాజికవర్గం బలంగా ఉన్న గోదావరి జిల్లాలో వైసీపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. అలాగే మరో పదేళ్ల పాటు టీడీపీ + జనసేన + బీజేపీ ల రాజకీయ బంధం ఇలానే సాగాలని, సాగుతుందని పవన్ నుంచి బాబు వరకు పదేపదే నొక్కి వక్కాణిస్తున్నారు.

ఈ తరుణంలో వైసీపీ ముందున్న రాజకీయ లక్ష్యం…పొత్తుతో కూటమి కూడగట్టుకున్న కాపు ఓటింగ్ ని చీల్చి ఆ సామాజికవర్గం ఓట్ బ్యాంకును తన పార్టీ ఖాతాలో వేసుకోవడమే. అందుకు వైసీపీ ఎంచుకున్న మార్గం వైసీపీ కి తొందరలో అత్యంత బలమైన ఒక రాజకీయ నాయుడును తయారుచేయడం లేదా ఆ సామాజికవర్గాన్ని ప్రభావితం చెయ్యగలిగిన నేతను వెతికి పట్టుకోవడమే.

ఇందుకోసం ఇప్పటికే వైసీపీ అంబటిని తెరమీదకు తెచ్చింది. అయితే అంబటి రాంబాబు తో వైసీపీ అనుకున్న రాజకీయ లక్ష్యాన్ని అందుకుంటుందనే నమ్మకం ఆ పార్టీ నేతలలోనే కనిపించడం లేదు. కానీ ప్రస్తుతానికి తాజాగా జరిగిన అంబటి అరెస్టు ద్వారా ఆ సామాజికవర్గం నుంచి వైసీపీ కొంత రాజకీయసానుభూతి ఆశిస్తుంది, అందుకోసం జగన్ ఉన్న అన్ని అస్త్రాలను వాడేశారు.

అయినా ఫలితం మాత్రం అంతమాత్రమనే చెప్పాలి. గత ఎన్నికలలో కాపు సామాజికవర్గ ఓటు బ్యాంకు కోసం ముద్రగడను రంగంలోకి దింపిన వైసీపీ చివరికి పవన్ గెలుపుతో ఆయన్ను రెడ్డి గా మార్చేసింది. మరి ఇప్పుడు వైసీపీ అధికార పీఠం కలలను నెరవేర్చే ఆ కాపు నేత ఎవరు.? ఎక్కడున్నారు.? ఎప్పుడొస్తారు.? అన్నది వైసీపీ కి అంతుపట్టని చిక్కు ప్రశ్నగా మారింది.

ADVERTISEMENT
Latest Stories