బిఆర్ఎస్ పార్టీలో అందరూ కేసీఆర్ భజన చేస్తుంటే, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు భజన చేస్తుంటారు. బిఆర్ఎస్ పార్టీ మనుగడ తెలంగాణ సెంటిమెంట్ మీద ఆధారపడి ఉందనే విషయం రహాస్యమేమీ కాదు. కనుక ఆ సెంటిమెంట్ని రాజేయాలంటే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని బూచిగా చూపిస్తుంటారు.
తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసుకుంటున్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు తండ్రి, అన్న, బావతో విభేదించి తెలంగాణ జాగృతిని మళ్ళీ యాక్టివేట్ చేసుకున్నారు. గులాబీ కండువా పక్కన పడేసి జాగృతి కండువాలు, జాగృతి జెండాలతో రాజకీయాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
అయితే తెలంగాణలో కేసీఆర్ పేరు చెప్పుకోకుండా బిఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయలేరు. వారి ఉనికి చాటుకోలేరు. కనుక కల్వకుంట్ల కవిత కూడా తండ్రి పేరుతోనే గేమ్ మొదలుపెట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో ఆయనకు నోటీస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ నేడు హైదరాబాద్, ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు.
కానీ అక్కడ కూడా ఆమె ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు భజన మొదలుపెట్టి, బనకచర్ల ప్రాజెక్టుతో గోదావరి నీళ్ళు దొంగిలించుకుపోతున్నారని ఆరోపించారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి అది పట్టించుకోకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు పారించిన కేసీఆర్ని దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆమె చంద్రబాబు నాయుడు, బనకచర్ల గురించి ఎంత మాట్లాడినా తెలంగాణ జాగృతికి రాజకీయ మైలేజ్ లభించదు. ఎందుకంటే దానిపై బిఆర్ఎస్ పార్టీ మాట్లాడితేనే ప్రజలు పట్టించుకుంటారు కనుక.
కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీలో ఉండాలా బయటకు వచ్చేయాలా?ఉంటే, లేకుంటే ఏవిదంగా ముందుకు సాగాలి? ఒకవేళ బయటకు వచ్చేస్తే తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్, బీజేపి, బిఆర్ఎస్ పార్టీల మద్య లేగదూడలా నలిగిపోతానా?అని ఆలోచించుకుని తన భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించుకుంటే ఆమెకే మంచిది.




