కల్వకుంట్ల కవితకి అమెరికా పర్యటనలు అచ్చి రాలేదా? అంటే అవుననే చెప్పుకోవాలేమో? ఇదివరకు ఆమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు చిన్న కొడుకుని అమెరికాలో కాలేజీలో చేర్పించేందుకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆమెకు పెద్ద షాక్ ఇచ్చింది.
బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి తొలగించింది. ఆమె స్థానంలో సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ని నియమించింది.
ఆమె అమెరికాలో ఉండగా బీఆర్ఎస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం యాదృచ్చికం కాదని చెప్పవచ్చు. ఆమెని బీఆర్ఎస్ పార్టీకి దూరం పెట్టిన తర్వాత ‘తెలంగాణ జాగృతి’ కండువా వేసుకొని రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కనుక బీఆర్ఎస్ పార్టీకి ఆయువుపట్టు వంటి సింగరేణి బొగ్గు గనులలో కూడా పార్టీకి అనుబందంగా పనిచేస్తున్న టిబిజికెఎస్ నేతలతో ఇటీవల సమావేశమై తెలంగాణ జాగృతి పేరుతో వేరు కుంపటి పెట్టించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. వామపక్షాలతో కలిసి ముందుకు సాగుతామని ఆమె చెప్పారు.
సింగరేణిలో సుమారు 40,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వారి కుటుంబాలు, బంధు మిత్రులను కూడా కలుపుకుంటే మరో లక్ష-లక్షన్నర మంది ఓటర్లు ఉంటారు. ఇంత బలమైన ఓటు బ్యాంకుని ఆమె తనవైపు తిప్పుకొని బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుండటంపై కేసీఆర్, కేటీఆర్ ఆగ్రహం చెందడం చాలా సహజం.
అందుకే ఆమె అమెరికా వెళ్ళినప్పుడు గౌరవధ్యక్షురాలు పదవిలో నుంచి తొలగించి కొప్పుల ఈశ్వర్ని నియమించింది. తద్వారా ఆమె తిరిగి వచ్చేలోగా ఆయన కార్మిక సంఘం నేతలని మళ్ళీ దారికి తెచ్చుకోగలరని కేసీఆర్ భావించి ఉండొచ్చు.
కానీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించకుండా, కనీసం తమకు మాట మాత్రంగానైన చెప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆమెను ఈ పదవిలో తొలగించడంపై టిబిజికెఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు సంఘం సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తున్నారు.
ఆమె తిరిగి వచ్చిన తర్వాత సింగరేణిలో టిబిజికెఎస్ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ అధిష్టానం చేస్తున్న కుట్రలను వివరిస్తామని సంఘం నేతలు చెపుతున్నారు.
ఆమెను తొలగిస్తే ఇటువంటి పరిణామాలు ఎదురవుతాయని కేసీఆర్, కేటీఆర్లకు తెలియదనుకోలేము. వాటికి వారు సిద్దపడే ఆమెను పదవిలో నుంచి తొలగించారు.
అమెరికా పర్యటనలో ఉన్న కల్వకుంట్ల కవితకి ఈ విషయం తెలుస్తుంది. ఇంతకాలం ఆమెకు తాను ఎప్పటికైనా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాననే చిన్న నమ్మకం ఉండేది. కానీ ఆ అవకాశం లేదని కేసీఆర్ ఈవిదంగా తెలియజేసినట్లే భావించవచ్చు.
కనుక ఆమె అమెరికా నుండి తిరిగి రాగానే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో యుద్ధం చేయడం ఖాయం. ఈసారి యుద్ధం మరింత భీకరంగా ఉండవచ్చు.






