రాజకీయాలలో గెలుపోటములు సర్వ సహజం. అయితే గెలిచినప్పుడుకన్నా ఓడినప్పుడే పార్టీలు, ఆ పార్టీల అధినేతలు ఆ ఓటమికి గల కారణాలు తెలుసుకోవాలి, వారి అపజయానికి గల సరైన రాజకీయ విశ్లేషణలు జరుపుకోవాలి. లేదంటే ఆ ఓటమి – ఆ అపజయం పార్టీని, పార్టీ అధినేతను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తుంది.
అయితే 2023 సార్వత్రిక ఎన్నికల తరువాత బిఆర్ఎస్ ఓటమికి కాంగ్రెస్ గెలుపుకి ఉన్న ముఖ్య కారణాలను కేసీఆర్ విశ్లేషించలేకపోయారా.? లేక కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదని భావించారా.? దాని ఫలితమే ఇప్పటికి తెలంగాణ ప్రతిపక్షంగా బిఆర్ఎస్ బలంగా ప్రజల మనసు గెలవలేకపోతుందా.? కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి రాలేకపోతున్నారా.?
అయితే బిఆర్ఎస్ ఓటమికి గల కారణాలను కేసీఆర్ కుమార్తె కవిత విశ్లేషిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కవిత నిర్వహిస్తున్న జనం బాట కార్యక్రమంలో భాగంగా మీడియా తో ముచ్చటించిన కవిత తుమ్మల నాగేశ్వరరావు ని గులాబీ కారు నుండి బయటకు పంపడంతో బిఆర్ఎస్ పతనం మొదలయ్యిందంటూ వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లాకే కాదు బిఆర్ఎస్ పార్టీకి కూడా తుమ్మల చాల బలమైన నాయకుడని, ఆయనను పార్టీ నుండి బయటకు పంపి కేసీఆర్ పెద్ద తప్పు చేసారని, అటువంటి కీలక నేత విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ఉంటే బిఆర్ఎస్ కి కేసీఆర్ కి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదంటూ కవిత విశ్లేషించారు.
అలాగే బిఆర్ఎస్ దాని అధినాయకత్వం తన విషయంలో కూడా చాల దారుణంగా వ్యవహరించిందంటూ వాపోయారు. గత రెండు దశాబ్దాల నుంచి పార్టీ కోసం నిరంతరం శ్రమించినా చివరికి సస్పెన్షన్ అనే అవమాన భారంతో బయటకు రావాల్సి వచ్చిందని, ఇలా పార్టీ ని నమ్ముకుని నిబద్ధతగా రాజకీయం చేసిన వారిని కేసీఆర్ దూరం చేసుకోవడం బిఆర్ఎస్ పతనానికి, కేసీఆర్ ఓటమికి ముఖ్య కారణాలన్నారు కవిత.
అయితే బిఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన కవిత కొత్త పార్టీ ఏర్పాటుతో తెలంగాణ రాజకీయాలలో అడుగుపెడతారు అని భావించిన వారికీ దానికి ఇంకాస్త సమయం ఉందని, ప్రస్తుతానికి పార్టీ ఏర్పాటు ఆలోచన లేదంటూ క్లారిటీ ఇచ్చారు.






