తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు తండ్రి కేసీఆర్ని కలిసేందుకు ఫామ్హౌసుకి వెళ్ళారు. కల్వకుంట్ల కవిత కుమారుడు అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు వెళుతున్నాడు. కుమారుడితో పాటు ఆమె కూడా నేడు అమెరికా బయలుదేరుతున్నారు. కనుక తన కొడుకుకి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకునేందుకు కుటుంబ సమేతంగా ఎర్రవల్లి ఫామ్హౌసుకు వచ్చారు. అక్కడ బీఆర్ఎస్ సభ్యులు ఆమెకు గుమ్మడి కాయతో దిష్టి తీసి లోనికి ఆహ్వానించారు.
ఇదివరకు ఆమె అమెరికా నుంచి తిరిగివచ్చిన తర్వాత తండ్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ విధానాలను తప్పు పట్టారు. కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు తిరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేయాలనే కేసీఆర్ ఆలోచనని ఆమె బయటపెట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించారు. అందుకు ఆగ్రహించిన కేసీఆర్ అప్పటి నుంచి ఆమెను దూరం పెట్టారు. కనుక కేటీఆర్తో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆమెకు దూరంగా ఉంటున్నారు. కనుక ఆమె తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేసి ఆ కండువా కప్పుకొని రాజకీయాలు చేస్తున్నారు.
ఇప్పుడు కొడుకుకి ఆశీర్వాదం కోసమే ఆమె తండ్రి వద్దకు వచ్చినప్పటికీ, ఆయనని ప్రసన్నం చేసుకొని మళ్ళీ దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నంగా కూడా దీనిని చూడవచ్చు.మరి కేసీఆర్ ఇప్పటికైనా కూతురుని కరుణిస్తారా? కరుణిస్తే ఆమె తండ్రి చుట్టూ ఉన్న దెయ్యాలతో సర్దుకుపోతారా? ఒకవేళ కేసీఆర్ కరుణించకపోయినా ఆమె సర్దుకుపోలేకపోయినా ఈ దూరం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు.






