పొత్తుతో ఎదిగిన పార్టీ పొత్తుల గురించి మాట్లాడడం వినడానికే విడ్డురంగా ఉందనిపిస్తుంది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి వున్నాడు కాంగ్రెస్ తో మరోనాడు తెలుగు దేశం తో, అలాగే ప్రత్యేక రాష్ట్రం ఇస్తానంటే ఎవరితోనైనా పొత్తుకు సిద్ధం, పార్టీని విలీనం చెయ్యడానికి సంసిద్ధం అంటూ ప్రకటించిన కేసీఆర్ జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ తెరాస పార్టీని ఒక్కో మెట్టు ఎక్కించి నేటికీ ఈ స్థాయికి తీసుకురాగలిగారు.
అయితే ఇలా ప్రాంతీయ వాదంతో పుట్టి, పొత్తుల తో పెరిగి, అవకాశవాద రాజకీయాలతో అధికారాన్ని అందుకున్న బిఆర్ఎస్ ఇప్పుడు టీడీపీ పార్టీ పొత్తు రాజకీయాల మీద ఆసక్తికర ప్రకటనలు చేస్తుంది. తెలంగాణ రాజకీయాలతో ఏపీ నాయకులకు సంబంధం ఏమిటి.? తెలంగాణలో ఏపీ వారి పెత్తనం అవసరమా.? అంటూ ప్రాంతీయ వాదాన్ని రెచ్చకొట్టే కేసీఆర్ పదేపదే ఏపీ రాజకీయాల మీద మాత్రం తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూనే ఉంటారు.
ఏపీ ఎన్నికల సమయంలో కూడా ఏపీలో మరోమారు వైస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు అంటూ జోస్యం చెప్పారు. తాజాగా ఏపీలో అధికారాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ పార్టీని, ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
ఏపీలో కూటమి పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదని, టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాదంటూ వ్యాఖ్యానిస్తూ మరోమారు జగన్ పై తనకున్న ప్రేమను కేసీఆర్ బయటపెట్టుకున్నారు. అలాగే రాబోయే రోజులలో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ మాత్రం సింగిల్ గానే పోటీలో తలబడుతుందంటూ వెల్లడించారు.
అయితే తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనం అవసరమా అంటూ నిలదీసే కేసీఆర్ ఏపీలో మాత్రం తెలంగాణ నాయకుల అభిప్రాయాన్నే రుద్దే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం.? గత ఐదేళ్లు జగన్ తో కలిసి తెరచాటు రాజకీయం నడిపిన కేసీఆర్ ఇప్పుడు బాబు నాయకత్వాన్ని సహించలేకపోతున్నారా.?
తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ఓటమికి ప్రత్యక్ష, పరోక్ష కారణమైన చంద్రబాబు మీద కేసీఆర్ ఇప్పటికి తన ద్వేషాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా వెళ్ళగగ్గుతూనే ఉంటున్నారు. 2019 లో బాబు కి రిటర్న్ గిఫ్ట్ అంటూ జగన్ తో చేయికలిపిన కేసీఆర్ అందుకు 2023 లో మూల్యం చెల్లించిన ఇంకా టీడీపీ మీద ద్వేషం, బాబు మీద అసూయా బహిర్గతం చేస్తూనే ఉన్నారు.
తెలంగాణ కోసం పోరాడేది ఒక్క బిఆర్ఎస్ మాత్రమే అంటున్న కేసీఆర్ అసలు పార్టీ పేరులో ఉన్న తెలంగాణను ఎందుకు తొలగించారో చెప్పగలారా.? తన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దాదాపు ఆరు మాసాలు తీహార్ జైల్లో ఉన్నప్పటికీ కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద కానీ బీజేపీ నాయకత్వం మీద కానీ ఒక్క విమర్శ కూడా ఎందుకు చేయలేకపోయారు.?
తన దాకా వస్తే తెరచాటు రాజకీయంతో అనధికార పొత్తులతో అవకాశవాద రాజకీయాలు చేసుకోవచ్చు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి కర్త, కర్మ, క్రియ అన్నట్టుగా కేసీఆర్ చేసిన లోగుట్టు రాజకీయం అందరికి ఎరుకే అన్న సంగతి ఆ పెద్ద మనిషి గ్రహిస్తే మంచిది. అలాగే తాజాగా తెలంగాణలో జరిగిన పట్ఠభద్రుల ఎన్నికలలో బిఆర్ఎస్ పోటీ నుండి పక్కతప్పుకోవడం ఎవరికోసమో.? ఏ పార్టీకి రాజకీయ లబ్ది చేకూర్చడానికో చెప్పగలరా.?
ఆ ఇంటికి ఈ ఇళ్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం అన్న సంగంతి ఇప్పటికైనా కేసీఆర్ గ్రహిస్తే మంచిది అనే భావన ఏపీలో బలంగా వినిపిస్తుంది. టీడీపీ సహనం, బిఆర్ఎస్ కు బలంగా, టీడీపీ కి బలహీనంగా మారుతుంది అనే విషయం టీడీపీ నాయకులు కూడా గుర్తించాలి. బిఆర్ఎస్ పార్టీ పట్ల టీడీపీ వహిస్తున్న మెతక వైఖరికి రానురాను ఏపీ రాజకీయాల పై కూడా ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు.




