తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఉన్నట్టుండి బీజేపీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఒక జాతీయ స్థాయి ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనికోసం అప్పుడే ముమ్మర కసరత్తు కూడా మొదలు పెట్టారు. వివిధ జాతీయ నాయకులతో మాట్లాడటం చేస్తూనే మరోపక్క మేధావులతో ఫ్రంట్ ఎజెండాపై చర్చిస్తున్నారు.
అయితే ఈ ఫ్రంట్ లోకి తెలుగు దేశంని తీసుకుని రాగల్గుతారా అనేది అసలు ప్రశ్న. ఒకప్పటి తన జూనియర్ సారధ్యంలో చంద్రబాబు పని చెయ్యగల్గుతారా? చంద్రబాబు అంటే నిప్పులు చెరిగే కేసీఆర్ ఆయనకు స్నేహ హస్తం చాటగలరా అనేది కూడా చూడాలి. జాతీయ స్థాయిలో విస్తృత పరిచయాలు గల చంద్రబాబు అనుభవం కేసీఆర్ కు చాలా అవసరం.
అయితే ఆయన దానిని గుర్తించగలుగుతారా అనేదే అసలు ప్రశ్న. రెండు పార్టీలు తెలంగాణాలో పొత్తుకు వెళ్లే పరిస్థితి ఉంటే అక్కడ క్లియర్ గా టీడీపీ తక్కువ స్థాయిలోనే ఉంది కాబట్టి సమస్య ఉండదు. అయితే జాతీయ స్థాయి రాజకీయాలు వచ్చే సరికి చంద్రబాబు తగ్గే పరిస్థితి ఉండదు. అదే సమయంలో చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ లో జాయిన్ కావాలంటే దానిపై ఆయనకు నమ్మకం కలగాలి.
అది కలిగించే బాధ్యత కేసీఆర్ దే. నిజానికి ఈ ఫ్రంట్ సక్సెస్ కావాలంటే అన్ని పార్టీలను ఆయన నమ్మించగలగాలి. తెలంగాణలో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులు, ఇంటింటికీ తాగునీరందించే మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ కాకతీయ, రైతులకు రూ. 8,000 పెట్టుబడి సాయం, రుణమాఫీ, భూరికార్డుల ప్రక్షాళన వంటి వాటినే జాతీయ స్థాయిలో అమలు చేస్తామని ఆయన చెప్పబోతున్నారు.



