బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇంటా బయట అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆయనకు మరో పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో హెచ్చరించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారని తెలియజేస్తూ ఓ పొలిటికల్ కార్టూన్ పోస్ట్ చేసింది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకి వెళ్ళి మూడు నెలల్లోగా వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కి ఆదేశాలు జారీ చేయించినందుకు కేటీఆర్ తదితర బీఆర్ఎస్ పార్టీ నేతలు భుజాలు చరుచుకున్తున్నారు. మూడు నెలల్లోగా 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని అందరూ సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కూడా.
పనిలోపనిగా కాంగ్రెస్లో చేరిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులో కేసు వేసి వారిపై కూడా అనర్హత వేటు వేయించాలని కేసీఆర్ సూచించారు.
కనుక సుప్రీంకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చామని కేసీఆర్, కేటీఆర్ పొంగిపోతుంటే, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రకటింఛి వారికి షాక్ ఇచ్చింది.
ఇది కాంగ్రెస్ పార్టీ వారితో ఆడుతున్న మైండ్ గేమా లేక నిజంగానే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గులాబీ కారు దిగిపోబోతున్నారా? అనేది త్వరలో తెలుస్తుంది. ఒకవేళ మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ బలం 29 నుంచి 26కి పడిపోతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్రమాద ఘంటిక వంటిదే. ఒకవేళ ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీనపడుతుంది. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది కనుక కారు దిగబోతున్న ఒకవేళ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరో కూడా చెప్పేస్తే బాగుంటుంది కదా?







